రియాను వెంబడించవద్దంటూ జర్నలిస్టులకు పోలీసుల హెచ్చరిక

రియాను వెంబడించవద్దంటూ జర్నలిస్టులకు పోలీసుల హెచ్చరిక

డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తికి బెయిల్ లభించింది. త్వరలోనే ఆమె జైలు నుంచి విడుల కానుంది. అయితే, ఇప్పటికే ఈ కేసులో రియా నుంచి ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన జాతీయ మీడియా మరోసారి ఆమె వెంటపడే అవకాశం ఉండడంతో మీడియాకు ముంబై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

రియా బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చే సందర్భంలో మీడియా ఆమె వాహనాన్ని వెంబడించరాదని అన్నారు. ఆమెపై సంబంధం లేని ప్రశ్నలు అడగవద్దని చెప్పారు. సెలబ్రిటీలను,  వారి న్యాయవాదులను జర్నలిస్టులు ఇంటర్వ్యూలు చేయాలనే ఉద్దేశంతో వారి వాహనాలను వెంబడించొద్దని సూచించారు. ఇలా వాహనాలను వెంబడించడం నేరమని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాదు అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలను వెంబడిస్తే జర్నలిస్టుల జీవితాలతోపాటు, రోడ్ల మీద నడుస్తున్న సాధారణ ప్రజలకు ప్రమాదమని చెప్పారు. సెలబ్రిటీల వాహనాలను ఇతర వాహనాల్లో వెంబడించే డ్రైవర్‌తో పాటు వారిని ప్రేరేపించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.