
- చాలాచోట్ల 20 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం
- 16 రోజుల ముందే నైరుతి..-75 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి
- జనజీవనం అస్తవ్యస్తం.. స్తంభించిన రవాణా
- ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్
- ముంపు ఏరియాలోని 48 మందిని రక్షించిన అధికారులు
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం రాత్రినుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నది. సోమవారం ఉదయం వరకు చాలా ప్రాంతాల్లో 20 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా దక్షిణ ముంబైలో వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. సోమవారం మధ్యాహ్నం ఐఎండీ ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాలతోపాటు వీటి పక్క జిల్లాల్లోనూ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం ఉదయం వరకు
ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని పేర్కొంది.
మే నెలలో ఇదే భారీ వర్షం
ముంబైలో నైరుతి ప్రవేశించిన మొదటిరోజే భారీ వర్షం ముంచెత్తింది. కొలాబా అబ్జర్వేటరీలో మే నెలలో వర్షపాతం 29.5 సెంటీ మీటర్లుగా నమోదైంది. మే నెలలో 107 ఏండ్లలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే. 1918లో అత్యధికంగా 27.9 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డైంది. ఈసారి ముంబైకి 16 రోజుల ముందే నైరుతి వచ్చినట్టు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. 75 ఏండ్లలో సీజన్ కంటే ఇంత ముందుగా ముంబైలో వర్షాలు పడటం ఇదే తొలిసారి అని తెలిపింది. ‘‘నైరుతి రుతుపవనాలు సోమవారమే ముంబైకి చేరుకున్నాయి. సాధారణం కంటే 16 రోజుల ముందుగానే వర్షాకాలం మొదలైంది. 2001–2025 మధ్య కాలంలో ముంబైకి ముందుగా వచ్చిన తొలి రుతుపవనాలు ఇవే” అని పేర్కొంది.
ప్రతిచోటా 15 సెంటీ మీటర్లుకు పైనే వర్షపాతం
ఆదివారం నుంచి సోమవారం ఉదయం 11 గంటలవరకు బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) పరిధిలో వర్షం కుండపోతలా కురిసింది. ప్రతిచోటా 15 సెంటీ మీటర్లకుపైగానే వర్షపాతం నమోదైంది. నారిమన్పాయింట్ స్టేషన్ 25.2 సెంటీ మీటర్లు, బైకుల్లా ఈవార్డ్ 21.3, కొలాబా 20.7, డు టకి స్టేషన్ 20.2, మెరైన్ లైన్స్, చందన్వాడీ 18, మెమోన్వాడ 18.3, వర్లీలో 17.1 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. సోమవారం ఉదయం కొలాబాలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఇక ఎడతెరిపిలేని వానలతో ప్రజారవాణా స్తంభించింది.
విమాన సేవలకు అంతరాయం కలిగింది. విమానం రాకపోకల స్టేటస్ను తనిఖీ చేసుకోవాలని స్పైస్జెట్, ఎయిర్ ఇండియా సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీ జారీచేశాయి. కుర్లా, సియోన్, దాదర్, పరేల్లోని అనేక లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. మరోవైపు, రైల్వే లైన్లపై నీరు నిలిచిపోవడంతో సబర్బన్ రైలు సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటినుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. నగరంలో 96 భవనాలుప్రమాదకర స్థితిలో ఉన్నట్లు గుర్తించి, వాటిలో ఉంటున్న 3,100 మందిని
సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలిపారు.
మహారాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
పుణె, సతారా, సోలాపూర్, రాయ్గఢ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయం వెల్లడించింది. రాయ్గఢ్ జిల్లాల్లో పిడుగుపాటుకు ఒకరు మృతిచెందారని తెలిపింది. వరద ముంపు ప్రాంతాల నుంచి 48 మందిని రక్షించినట్లు పేర్కొన్నది. దౌండ్లో 11.7 సెంటీ మీటర్లు, బారామతిలో 10.4, ఇందాపూర్లో 6.3 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయినట్లు వెల్లడించింది. భారీ వర్షానికి బారామతిలో 25 ఇండ్లు కూలిపోయినట్లు తెలిపింది. 70–80 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది.
కర్నాటకలోనూ భారీ వర్షం
కర్నాటక తీరప్రాంతంలో వరుసగా మూడో రోజు సోమవారం కూడా భారీ వర్షాలు కురిశాయి. దక్షిణ జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. దీంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. కర్నాటక తీరప్రాంతానికి రాబోయే 5 రోజులు రెడ్ అలర్ట్ అమల్లో ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. 24 గంటల్లో 20 సెంటీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే చాన్స్ఉందని తెలిపింది. ఉత్తర కన్నడ జిల్లాలోని కుంటా సమీపంలో కొండచరియలు విరిగిపడినట్లు సమాచారం. బెల్తంగడి చుట్టూ ఉన్న నదుల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయని, లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు.