
హైదరాబాద్, వెలుగు: పట్టణాల్లో సౌలత్ల డెవలప్మెంట్, రూపురేఖల్ని నిర్దేశించే మాస్టర్ ప్లాన్ రెడీ చేయడంలో మున్సిపల్ టౌన్ప్లానింగ్ అధికారులు(టీపీవో) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి ముందు తెలంగాణలో 73 మున్సిపాలిటీలుండగా… ప్రస్తుతం వాటి సంఖ్య 142కు చేరుకుంది. అయితే ఇప్పటి వరకు కేవలం 17 మున్సిపాలిటీలకే మాస్టర్ప్లాన్ తయారు చేశారు. వీటిలో జనగాం, పాల్వంచ, బైంసా, సిరిసిల్ల, జగిత్యాల, జహీరాబాద్, కాగజ్నగర్, తాండూరు, మెదక్, గద్వాల్, సదాశివపేట, నిర్మల్, నారాయణపేట, వనపర్తి, బోధన్, కామారెడ్డి, కొత్తగూడెం ఉన్నాయి. పట్టణాల పరిధి పెరగడంతో వాటిని కూడా ఇటీవల రివైజ్ చేశారు.
మార్చిన ప్లాన్లకు ప్రభుత్వ అప్రూవల్ రావాల్సి ఉంది. మరో 42 మున్సిపాలిటీలు మాస్టర్ ప్లాన్ రెడీ చేసినప్పటికీ అప్రూవల్ కాలేదు. డ్రాఫ్ట్(ముసాయిదా) దశలో ఉన్న ఈ మ్యాప్లను ప్రజలు చూసేందుకు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) వెబ్సైట్లో ఆఫీసర్లు ఇటీవల అప్లోడ్ చేశారు. వీటిలో వరంగల్ రీజియన్ పరిధిలో 29 , హైదరాబాద్ రీజియన్ పరిధిలో 30 మున్సిపాలిటీలున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన 63 మున్సిపాలిటీలతోపాటు మరో 20 పాత మున్సిపాలిటీలకు ఇంతవరకు మాస్టర్ ప్లాన్ లేవు. కొత్త మున్సిపల్ యాక్ట్ అమలులోకి రానున్న నేపథ్యంలో వీటిని త్వరగా రెడీ చేయాల్సి ఉంది.