
టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే భవిష్యత్ ప్రస్తుతం ప్రస్నార్ధకంగా మారింది. వీరిద్దరూ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడతారా లేదా అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. సీనియర్ ప్లేయర్లు అయినప్పటికీ వీరు వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగడం కష్టమని బీసీసీఐ చెప్పనట్టు సమాచారం. ఈ సీనియర్ ప్లేయర్స్ వరల్డ్ కప్ ప్రణాళికలో లేరు. అక్టోబర్ లో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ వారి కెరీర్ లో చివరిదైనా ఆశ్చర్యం లేదని టాక్ నడుస్తోంది. ఈ దశలో వీరిద్దరిని అతిగా నమ్ముకోవాల్సిన అవసరం లేదని గంగూలీ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.
గంగూలీ మాట్లాడుతూ.. " ఎవరి కారణంగానో ఇండియన్ క్రికెట్ ఆగదు. టీమిండియాలో చాలా నైపుణ్యం దాగి ఉంది. సునీల్ గవాస్కర్ వెళ్ళిపోతే సచిన్ వచ్చాడు. ద్రవిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్ జట్టును ముందుకు తీసుకెళ్లారు. వీరు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత కోహ్లీ వచ్చాడు. కోహ్లీ తరం ముగుస్తున్న తరుణంలో జైశ్వాల్, రిషబ్ పంత్, శుభమాన్ గిల్ భారత క్రికెట్ లోకి దూసుకొచ్చారు. వీరు భారత జట్టును ముందుకు తీసుకెళ్తారనే భరోసా కల్పించారు.
కెరీర్ను కొనసాగించడానికి పెర్ఫామెన్స్ మాత్రమే నిర్ణయాత్మకం అంశం కావాలి. ఎవరు ఎలా ఆడతారో చెప్పడం కష్టం. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ రాణిస్తే అలాగే కొనసాగించాలి. కోహ్లీ, రోహిత్ వన్డే రికార్డులు అసాధారణంగా ఉన్నాయి. వైట్బాల్ క్రికెట్లో వీళ్లకు తిరుగులేదు’ అని గంగూలీ పేర్కొన్నాడు. ఇప్పటికే టెస్ట్, టీ20లకు గుడ్బై చెప్పిన రోకో ద్వయం వన్డేలపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
2027 వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగుతారా? లేదా? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆసీస్, సౌతాఫ్రికాతో చెరో మూడు వన్డేల సిరీస్ తర్వాత 2026లో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్, మళ్లీ న్యూజిలాండ్తోనూ సిరీస్లు ఉన్నాయి. అప్పటి వరకు వీళ్ల ఫామ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక సెప్టెంబర్ 9 నుంచి జరిగే ఆసియా కప్లో ఇండియా ఫేవరెట్ అని గంగూలీ వెల్లడించాడు.