- మొబైల్ ను అమ్మి రూ.1,700తో జల్సా చేసిన నిందితుడు
- మలక్పేట రైల్వే స్టేషన్ లో జరిగిన మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
- ఇంకా లభించని హత్యకు గురైన వ్యక్తి వివరాలు
సికింద్రాబాద్, వెలుగు : ఈ నెల 6న మలక్ పేట రైల్వే స్టేషన్ లో జరిగిన గుర్తుతెలియని వ్యక్తి మర్డర్ కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. జల్సాలకు బానిసైన పాత నేరస్తుడు ఈ హత్యకు పాల్పడినట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే అడిషనల్డీజీ మహేష్ భగవత్, రైల్వే ఎస్పీ షేక్ సలీమాతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 6న తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో మలక్పేట్ రైల్వే స్టేషన్లో మెట్లపై 35 ఏండ్ల గుర్తుతెలియని వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నట్లు కాచిగూడ రైల్వే పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని హత్యచేసి పారిపోయినట్లు నిర్ధారించుకొని, డెడ్బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం మర్డర్ జరిగిన సమయంలో రైల్వే స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి.. పలువురిపై నిఘాపెట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 6.30 గంటల సమయంలో యాకత్పురా రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతన్ని చాదర్ఘాట్ ఆజంపురా చమన్ ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు మహ్మద్ సోహైల్(24)గా గుర్తించారు.
ఆ సమయంలో అతని వద్ద ఓ కత్తి లభించడంతో వెంటనే కాచిగూడ పోలీసుస్టేషన్కు తరలించి ఇంటరాగేట్ చేశారు. అయితే, డబ్బుల కోసం గుర్తుతెలియని వ్యక్తి వద్ద ఉన్న సెల్ ఫోన్ను లాక్కొనేందుకు ప్రయత్నించానని, అతడు ప్రతిఘటించడంతో ఆవేశానికి గురై కత్తితో పొడిచి హత్య చేసినట్లు సోహైల్చెప్పాడు. హత్య చేసిన తరువాత సెల్ఫోన్ను ఎంజీబీఎస్లో ఓ వ్యక్తికి రూ.1,700 కు విక్రయించి ఆ డబ్బులతో జల్సాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్కు తరలించారు.
సోహైల్ షాఇనాయత్ గంజ్, చాదర్ఘాట్, మీర్చౌక్, డబీర్పురా, కాచిగూడ పోలీసు స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడు. కాగా, హత్యకు గురైన వ్యక్తి వివరాలు ఇంకా లభించలేదని, అతని వివరాల కోసం ఆధారాలు సేకరిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే, పోలీసుస్టేషన్ల పరిధిలో ఏమైనా మిస్సింగ్కేసులు నమోదు అయి ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.