ఆంగ్ సాన్ సూకీకి జైలు నుంచి విముక్తి.. క్షమాభిక్ష ప్రసాదించిన జుంటా..

ఆంగ్ సాన్ సూకీకి జైలు నుంచి విముక్తి.. క్షమాభిక్ష ప్రసాదించిన జుంటా..

2021లో పలు అభియోగాలతో సైనిక నిర్భంధంలో ఉన్న ఆంగ్ సాన్ సూకీకి విముక్తి లభించింది. ఆమెకు మయన్మార్ సైనిక ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. ప్రస్తుతం ఆమె జైలు నుంచి విడులైనప్పటికీ గృహ నిర్బంధంలో ఉన్నారు. 

మ‌య‌న్మార్ పౌర నేత ఆంగ్ సాన్ సూకీకి విముక్తి ల‌భించింది. ఆమెకు సైనిక ప్రభుత్వం క్షమాభిక్ష క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. బుద్ధ పూర్ణిమ సంద‌ర్భంగా సైనిక ప్రభుత్వం ఈ ప్రక‌ట‌న చేసిన‌ట్లు భావిస్తున్నారు. 2021లో సూకీని సైన్యం అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. వేర్వేరు కేసుల్లో ఆమెను దోషిగా తేల్చారు. అయితే దేశ‌వ్యాప్తంగా దాదాపు ఏడువేల మంది ఖైదీల‌కు క్షమాభిక్ష క‌ల్పిస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

క్షమాభిక్ష కింద ఆమెపై ఉన్న అయిదు కేసుల్ని ర‌ద్దు చేశారు. మ‌రో 14 కేసులు అలాగే ఉన్నట్లు  స‌మాచారం.   రాజ‌ధాని నైపితాలో  నోబెల్ గ్రహీత సూకీని హౌజ్ అరెస్టు చేశారు. ఆమెను సోమవారం (జులై 31)  ప్రభుత్వ బిల్డింగ్‌కు మార్చిన‌ట్లు స్థానిక మీడియా తెలిపింది. ఏడాదిగా ఆమె క‌ఠిన జైలు జీవితాన్ని అనుభ‌వించారు. ఎన్నిక‌ల ఫ్రాడ్‌కు చెందిన కేసుల్లో ఆమె కోర్టులో పోరాడుతోంది. త‌న‌పై చేసిన అభియోగాల‌ను ఆమె ఖండించారు. క్షమాభిక్ష క‌ల్పించినా.. ప్రస్తుతానికి సూకీని గృహ‌నిర్బంధంలోనే ఉంచ‌నున్నట్లు మ‌య‌న్మార్ రేడియో వెల్లడించింది. 

78 ఏళ్ల సూకీ తొలిసారి 1989లో అరెస్టు అయ్యారు. 1991లో ఆమెకు నోబెల్ శాంతి బ‌హుమ‌తి ద‌క్కింది. 2010లో ఆమె హౌజ్ అరెస్టు నుంచి విముక్తి అయ్యారు. 2015 ఎన్నిక‌ల్లో ఆమె పార్టీ మ‌య‌న్మార్‌లో నెగ్గింది. కానీ సంస్కర‌ణ‌లను వ్యతిరేకించిన సైన్యం మ‌ళ్లీ తిరుగుబాటు చేసింది. దీంతో ఆమె మ‌ళ్లీ 2021లో నిర్బంధంలోకి వెళ్లింది.క్షమాభిక్షతో 33 ఏళ్ల జైలు శిక్షను ఆరేళ్లకు త‌గ్గించారు. మాజీ అధ్యక్షుడు విన్ మింట్‌కు కూడా జైలు శిక్షాకాలాన్ని కుదించారు