బ్రిటిష్ అధికారుల మీద పులిలా విరుచుకుపడ్డాడు అల్లూరి సీతారామరాజు. బానిస పాలనపై సింహంలా తిరగబడ్డాడు కొమురం భీమ్. ఆ వీరులిద్దరూ కలిసి పోరాడితే ఎలా ఉండేదో అనే ఊహే ఒక అద్భుతం. ఇక ఆ అద్భుతాన్ని రాజమౌళి లాంటి దర్శకుడు తెరపై చూపిస్తే ఎలా ఉంటుంది? ‘ఆర్ఆర్ఆర్’లా ఉంటుంది. రామ్ చరణ్ని రామరాజుగా, ఎన్టీఆర్ని భీమ్గా మార్చి ఓ పెద్ద సంగ్రామానికే సిద్ధమయ్యాడు జక్కన్న. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా జనవరి 7న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. రామ్, భీమ్లపై తీసిన ఓ మాస్ సాంగ్ను నిన్న రిలీజ్ చేశారు.
‘పొలంగట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు.. పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు.. కిర్రు సెప్పులేసుకోని కర్రసాము సేసినట్టు.. మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు.. ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు.. నా పాట సూడు నాటు, వీర నాటు’ అంటూ సాగిన ఈ పాట క్షణాల్లో వైరల్ అయిపోయింది. కీరవాణి ట్యూన్, చంద్రబోస్ లిరిక్స్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవల సింగింగ్.. ఫ్యాన్స్ని ఊపేసేలా ఉన్నాయి. ఇక హీరోల ఎనర్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరూ మంచి డ్యాన్సర్లేమో.. స్టెప్పులతో దుమ్ము రేపారు. వారి డ్రెస్సింగ్ కూడా డిఫరెంట్గా, అట్రాక్టివ్గా ఉంది. ఆల్రెడీ వీరిరువురూ కలసి కనిపించిన ‘దోస్తీ’ పాట రికార్డులు సృష్టించింది. మరి ఈ నాటు సాంగ్ ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేయనుందో.