కాంగ్రెస్ అసంతృప్త నేతలు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, నాగర్ కర్నూల్ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. నాగం జనార్ధన్ రెడ్డిని, విష్ణువర్ధన్ రెడ్డిని హృదయపూర్వకంగా బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు కేసీఆర్. నాగం జనార్ధన్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో ఎంతో చరిత్ర ఉందన్నారు. ఈ సారి పాలమూరు జిల్లాలో 14కు 14 సీట్లు గెలవాలన్నారు. జూబ్లీహిల్స్ లో పాత కొత్త నేతలు కలిసి పనిచేయాలని సూచించారు.
నాగం జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి నాగర్ కర్నూల్ టికెట్ ఆశించారు. సెకండ్ లిస్టులో తనకు టికెట్ దక్కకపోవడంతో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఫేక్ సర్వేలతో రేవంత్ టికెట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. మంత్రులు కేటీఆర్,హరీశ్ రావు నాగం ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరుతానని నాగం చెప్పారు. ఇవాళ బీఆర్ఎస్ లో చేరారు.
ఇక జూబ్లీహిల్స్ లో కీలక నేత దివంగత పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లిహిల్స్ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ ను వీడారు. మంత్రి హరీశ్ రావు విష్ణువర్ధన్ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు.