
బిగ్బాస్ షో ఈమధ్యనే ముగిసింది. రెండు నెలల్లోనే నెక్స్ట్ సీజన్ కూడా స్టార్ట్ కాను న్నట్టు ఫినాలే వేదిక మీదే నాగార్జున కన్ఫర్మ్ చేశారు. అయితే బుల్లితెరపై కాదు.. ఓటీటీ వేదికగా ఈసారి బిగ్బాస్ మొదలు కాబోతోంది. హాట్స్టార్లో లైవ్ స్ట్రీమ్ కాబోతోంది. దానికి కూడా నాగార్జునే హోస్ట్. ఈ విషయమై నిన్న హైదరాబాద్లో జరిగిన ప్రెస్మీట్లో నాగార్జున మాట్లాడుతూ ‘బిగ్బాస్ షో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్గానే ఫిఫ్త్ సీజన్ పూర్తయ్యింది. ‘అప్పుడే అయిపోయిందా’ అంటూ చాలామంది మెసేజ్ చేశారు. ఇంతలో ఓటీటీ బిగ్బాస్ గురించి హాట్స్టార్ వాళ్లు చెప్పారు. దాని గురించి విని నేను కాస్త షాకయ్యాననే చెప్పాలి. ఎందుకంటే, టీవీ చానల్స్ లో అయితే రోజంతా జరిగిన వాటిలో కొన్నింటిని తీసి చూపిస్తారు. కానీ ఇది అలా కాదు. ఇరవై నాలుగు గంటలూ లైవ్ వస్తుంది. అదంతా చూసి నేను వీకెండ్లో మాట్లాడాలి. చాలా పెద్ద చాలెంజ్. కానీ ఈ చాలెంజ్ని ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను’ అని చెప్పారు. ఈ సందర్భంగా తాము ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న ఇతర ప్రాజెక్టుల వివరాలను కూడా హాట్స్టార్ టీమ్ రివీల్ చేసింది. జగపతిబాబు, శరత్కుమార్, నవీన్ చంద్ర, ఆకాంక్ష సింగ్ నటించిన ‘పరంపర’ స్ట్రీమింగ్ మొదలైంది. అంజలి, తారకరత్న, అజయ్ ప్రధాన పాత్రల్లో క్రిష్ డైరెక్షన్లో ‘9 అవర్స్’ అనే సిరీస్ తెరకెక్కుతోంది. బ్యాంక్ దోపిడీ బ్యాక్డ్రాప్లో సాగే థ్రిల్లర్ ఇది. అలాగే మహి వి రాఘవ్ డైరెక్షన్లో ‘సైతాన్’ అనే హారర్ మూవీ.. మహిళలు, పిల్లలపై జరిగే అన్యాయాలను ఎదుర్కొనే మహిళ కథతో మధుశాలిని లీడ్ రోల్లో ‘ఝాన్సీ’ సిరీస్ కూడా రాబోతున్నాయి.