
నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహంకొనసాగుతుంది . క్రిష్ణా నది బేసిన్ లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తిన నేపథ్యంలో సాగర్ ప్రాజెక్ట్కు వరద నీరు వచ్చి చేరుతోంది. జూలై మొదటి వారంలోనే నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు పోటెత్తడంతో రైతులను ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో కొనసాగుతుంది. ఎగువన కృష్ణ బేసిన్ లో వర్షాలు ముందస్తుగా కురవడంతో గత ఐదు సంవత్సరాల నుండి ఎన్నడు లేని విధంగా జూలై మొదటి వారంలో నాగర్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద మొదలైనట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 58 వేల 205 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. ఔట్ ఫ్లో 4,899 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు అధికారులు. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుతం 527.90 ఉంది. మూడు రోజుల్లోనే నీటిమట్టం పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 164.0961 టీఎంసీలుగా ఉన్నది. ప్రస్తుతం సాగర్ జల విద్యుత్ కేంద్రంలో స్వల్పంగావిద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. నాగార్జునసాగర్ ఎడమ కాలువలు పరిధిలో రైతులకు నాట్లు వేసుకునేందుకు సిద్ధంగా అవుతున్నారు. ఈనెల చివరిలోనే ఎడమ కాలువకు నీటి విడుదల చేస్తారని ఆశాభావ వ్యక్తం చేస్తున్నారు రైతులు.