హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి తన వాహనాలకు ఎమ్మెల్యే స్టిక్కర్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. తనకు కేటాయించిన మూడు ఎమ్మెల్యే స్టిక్కర్లు ఎక్కడ మిస్ యూజ్ కాకుండా ఆ స్టిక్కర్లను అధికారులకు రిటర్న్ చేయాలని ఆయన నిర్ణయించారు.
తాను ప్రయాణించే ప్రతి వాహనానికి టోల్ ప్లాజా వద్ద కామన్ పీపుల్ వెళ్లే లైన్లోనే వెళ్లాలని సిబ్బందిని ఆదేశించారు. తన కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఆయన ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. జయవీర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.