- విశారదన్ మహరాజ్
ముషీరాబాద్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటన బాధితులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్ విమర్శించారు.
ఆదివారం బాగ్ లింగంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి సూర్య కిరణ్, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్, పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ కుమారస్వామి, ప్రొఫెసర్ రాజు నాయక్, రజక సంఘం నాయకులు అభయ్ దుర్గయ్య, బాధితులు మౌనిక గణేష్ చంద్రకళ కీర్తి, మహేశ్వరి కలిసి ఆయన మాట్లాడారు.
ఘటనపై డీజీపీకి పూర్తి వివరాలు అందించి 48 గంటలు గడిచినా నిందితులను అరెస్ట్ చేయకపోవడం, వారిపై హత్య కేసు కూడా నమోదు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. సూర్య కిరణ్ మాట్లాడుతూ.. పాపను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధితులను ప్రభుత్వం ‘క్యారెక్టర్ లెస్’ అని విమర్శించడం వారిని రెండోసారి హత్య చేయడమేనన్నారు.
కుమ్మెర ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి
ముషీరాబాద్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రజక దంపతులపై దాడి, చిన్నారి మృతి ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.ఈ విషయంపై రెండు రోజులపాటు ఢిల్లీ కేంద్రంగా నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఆదివారం విద్యానగర్లోని బీసీ భవన్లో ఆయన మాట్లాడుతూ.. ఈ అమానుష ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం దారుణమన్నారు. కేసు విచారణలో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఢిల్లీ కేంద్రంగా రెండు రోజుల పాటు నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు.
