
కందనూలు, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లాలో రైతుల నుంచి రికార్డు స్థాయిలో వడ్లు కొనుగోలు చేశామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. ఇప్పటి వరకు 1,23,375 మెట్రిక్ టన్నుల వడ్లను 21,329 మంది రైతుల నుంచి కొనుగోలు చేశామని, ఇందులో 63,427 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం,59,948 మెట్రిక్ టన్నుల సన్న రకం వడ్లు ఉన్నాయని చెప్పారు. గతంలో కంటే 3 రెట్లు అధికంగా వడ్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
కొనుగోళ్లు స్పీడప్ చేయాలి..
కోడేరు: వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. శనివారం పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ పి. అమరేందర్ తో కలిసి పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని, వర్షానికి వడ్లు తడవకుండా చూడాలని, లారీల కొరత లేదని, తేమ శాతం 17 వరకు ఉన్నా వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి నరసింహారావు, సివిల్ సప్లై డీఎం రాజేందర్, కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, పెద్దకొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాస్ ఉన్నారు.
కళల్లో రాణించాలి..
కొల్లాపూర్: చదువుతో పాటు కళల్లో రాణించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. పట్టణంలోని మినీ స్టేడియంలో రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సాంస్కృతిక కళా శిక్షణ తరగతులను కలెక్టర్ సందర్శించారు. పేరిణి, బోనాల కోలాటం, కర్నాటక సంగీతం, పెయింటింగ్, ఫోక్ డాన్స్ ప్రదర్శనలను తిలకించారు. ట్రైనర్స్ ను కలెక్టర్ అభినందించారు. అనంతరం పట్టణ సమీపంలో సిమెంట్, మట్టి ఇటుకల తయారీ యూనిట్లను పరిశీలించి, ఆదాయంపై ఆరా తీశారు. అడిషనల్ కలెక్టర్ పి అమరేందర్, ఆర్డీవో బన్సీలాల్, కొల్లాపూర్ తహసీల్దార్ విష్ణు వర్ధన్ రావు ఉన్నారు.