భార్యతో గొడవ.. జడ్జి సూసైడ్

భార్యతో గొడవ.. జడ్జి సూసైడ్

సికింద్రాబాద్, వెలుగు: భార్యతో గొడవల కారణంగా మనస్తాపం చెంది ఓ జడ్జి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లోని అంబర్​పేటలో జరిగింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ముత్తువెల్లి గ్రామానికి చెందిన అందే మణికంఠ (36).. నాంపల్లి కోర్టులో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఏడేండ్ల కింద మహబూబ్​నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రానికి చెందిన లలితతో వివాహమైంది. వీళ్లు బాగ్ అంబర్​పేట పోచమ్మ బస్తీలోని శ్రీనిధి రెసిడెన్సీలో ఫ్లాట్ నంబర్ 402లో నివాసం ఉంటున్నారు.

అయితే రెండేండ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో లలిత తన పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది. భార్యతో గొడవ కారణంగా మానసికంగా కుంగిపోయిన మణికంఠ.. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల టైమ్ లో ఇంట్లో బెడ్​రూమ్​లో చున్నీతో ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మణికంఠ తండ్రి శ్రీశైలం ఫిర్యాదు మేరకు అంబర్​పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మణికంఠ డెడ్​బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.