గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం 'అఖండ 2: తాండవం'. వీరిద్దరి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ "అఖండ"కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానున్న నేపథ్యంలో.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ విషయంలో మరింత దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో నవంబర్ 28, శుక్రవారం హైదరాబాద్లోని కూకట్ పల్లి , కైతలాపూర్ గ్రౌండ్స్ వేదికగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. . ఈ వేడుకకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ‘అఖండ 2’.. రిలీజ్ టీజర్ ను విడుదల చేశారు.
బాలయ్య మాస్ స్టామినా..
'సింహా', 'లెజెండ్', 'అఖండ' వంటి మూడు బ్లాక్బస్టర్ల తర్వాత బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగో చిత్రం 'అఖండ 2' .. తొలి భాగం కంటే రెట్టింపు అంచనాల మధ్య వస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈమూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఈ చిత్రంలో బాలయ్య సరసన కథానాయికగా సంయుక్త మీనన్ నటిస్తుంది. అటు విలన్గా ఆది పినిశెట్టి తాంత్రిక శక్తులున్న ఒక భయంకరమైన వ్యక్తిగా చూపించనున్నారు. తొలిసారి బాలీవుడ్ నటి హర్షాలీ మల్హోత్రా కూడా కీలక పాత్రలో తెలుగు తెరకు పరిచయం అవుతుంది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 'అఖండ'లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ భారీ చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించారు. సి. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. డిసెంబర్ 5న విడుదలవుతున్న ఈ " అఖండ 2 : తాండవం" కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
