- వరదలకు పంపుహౌస్లు మునగడంతో నిలిచిన లిఫ్టులు
- ఇటీవల మేడిగడ్డలో రెండు మోటర్లకు ట్రయల్రన్
- కొద్దిసేపు నడిపి బంద్ చేసిన్రు
- కింది నుంచి నీళ్లు రాకపోవడంతో ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తలే
- వేలాది ఎకరాల్లో యాసంగి సాగు ప్రశ్నార్థకం
పెద్దపల్లి/జయశంకర్భూపాలపల్లి, వెలుగు: ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్వరకు ఇక 365 రోజులూ జలదృశ్యమే’ అంటూ సీఎం కేసీఆర్చెప్పిన మాటలు అంతలోనే ఆవిరయ్యాయి. వందల కిలోమీటర్ల దూరంలోని మల్లన్నసాగర్ సంగతేమోగానీ, కాళేశ్వరం పక్కనే ఉన్న నందిమేడారం రిజర్వాయర్నీళ్లు లేక ఎండిపోతోంది. గతేడాది జులైలో వచ్చిన వరదలకు కన్నెపల్లి పంప్హౌస్ నీట మునగడంతో ఈ సీజన్లో కనీసం ఒక్క రోజు కూడా నడవకముందే కాళేశ్వరం లిఫ్టు స్కీం మూలపడింది. రిపేర్ల తర్వాత అన్నారం పంప్హౌస్లో నాలుగు మోటర్లకు, మేడిగడ్డలో ఆరు మోటర్లకు రిపేర్లు చేసినట్లు, మేడిగడ్డలో రెండు పంపుల ట్రయల్రన్నిర్వహించినట్లు ఇటీవలే ఆఫీసర్లు ప్రకటించారు. మంత్రి హరీశ్రావు కూడా ట్విటర్లో కాళేశ్వరం పున: ప్రారంభం అంటూ పోస్టు పెట్టి సంతోషం వెలిబుచ్చారు. కానీ, ఆ రెండు పంపులను కేవలం కొద్దిసేపే నడిపి బంద్పెట్టారు. కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోవడంతో ఎల్లంపల్లి నుంచి కూడా పంపింగ్స్టార్ట్చేయలేదని ఆఫీసర్లు చెప్తున్నారు.. దీంతో ఈ లిఫ్టు స్కీములో ఎల్లంపల్లి తర్వాత మొదటిదైన నందిమేడారం రిజర్వాయర్క్రమంగా ఎండిపోతోంది. ఫలితంగా దీనిపై ఆధారపడిన పెద్దపల్లి జిల్లాలోని 20 వేల ఎకరాల్లో యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. తలాపున గోదావరి ఉండి కూడా పంటలు పండించుకోలేని దయనీయ పరిస్థితి నెలకొందని ఇక్కడి రైతులు వాపోతున్నారు.
నీళ్లున్నా ఎత్తిపోయట్లే..
గతేడాది జూలైలో కురిసిన భారీ వర్షాలకు కన్నెపల్లి(లక్ష్మి), అన్నారం (సరస్వతి) పంప్హౌజ్లు మునిగి మోటార్లు ఖరాబయ్యాయి. గడిచిన ఆరు నెలల్లో కన్నెపల్లిలో ఆరు, అన్నారంలో నాలుగు మోటర్లకు ఆఫీసర్లు రిపేర్ చేయించి ఇటీవల ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. కానీ, పంపులను స్టార్ట్ చేసి ప్రాణహిత వాటర్ లిఫ్ట్ చేయడం ఇంకా మొదలుపెట్టలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడం వల్లే పంపులు స్టార్ట్ చేయట్లేదా? లేక ట్రయల్ రన్ సందర్భంగా మోటార్లలో ఏవైనా సమస్యలు వచ్చాయా? అనే విషయాలను ఆఫీసర్లు బయటికి తెల్వనీయడం లేదు. గోదావరి నదిపై నిర్మించిన నాలుగు బ్యారేజీల్లో ప్రస్తుతం 48 టీఎంసీల మేర నీళ్లున్నప్పటికీ కేవలం 0.78 టీఎంసీల కెపాసిటీ ఉన్న నందిమేడారం రిజర్వాయర్ నీళ్లు లేక వెలవెలబోతుండడం రైతులను విస్మయానికి గురి చేస్తోంది. కన్నెపల్లి, అన్నారం పంప్హౌజ్లు మునిగిపోవడం వల్ల నంది మేడారం రిజర్వాయర్కు వాటర్ సమస్య తలెత్తే అవకాశం లేదు. ఎందుకంటే సుందిళ్ల బ్యారేజీ నుంచి ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుంచి నంది మేడారంకు వాటర్ లిఫ్ట్చేయొచ్చు. ఇదీ కాకపోతే నేరుగా ఎల్లంపల్లి నుంచి నంది మేడారానికి నీళ్లను లిఫ్ట్ చేసినా సరిపోతుంది. ఇంకా కొద్ది రోజులు ఇలాగే కొనసాగితే నంది మేడారం రిజర్వాయర్ కింద ఉన్న సుమారు 20వేల ఎకరాల్లో సాగవుతున్న పంటలు నీళ్లు లేక ఎండిపోవడం ఖాయమని రైతన్నలు చెబుతున్నారు. ఈ రిజర్వాయర్కింద బోర్లు, బావులను నమ్ముకుని యాసంగిలో వరినాట్లు వేశామని, ఎలాగైనా నీళ్లిచ్చి పంటలను కాపాడాలని ధర్మారం, వెల్గటూర్, పాలకుర్తి మండలాల రైతులు అధికారులను కోరుతున్నారు.
రిజర్వాయర్ల పరిస్థితి ఇదీ..
మేడిగడ్డ బ్యారేజీ(లక్ష్మి) కెపాసిటి 16.17 టీఎంసీలు కాగా, బ్యారేజీలో 12.79 టీఎంసీలున్నాయి. ప్రాణహిత నుంచి రోజుకు 2,500 క్యూసెక్కులు వస్తోంది. దీంతో ఆఫీసర్లు బ్యారేజీ గేట్ ఒకటి తెరిచి 320 క్యూసెక్కులను వదులుతున్నారు.
అన్నారం బ్యారేజీ(సరస్వతి) కెపాసిటీ 10.87 టీఎంసీలకు 9.20 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. లోకల్ స్ట్రీమ్ నుంచి బ్యారేజీలోకి వరద రావట్లేదు. ఆఫీసర్లు అన్ని గేట్లను మూసెయ్యడంతో అవుట్ ఫ్లో కూడా లేదు.
సుందిళ్ల బ్యారేజీ(పార్వతి) కెపాసిటీ 8.83 టీఎంసీలకు 6.74 టీఎంసీలున్నాయి. లోకల్ స్ట్రీమ్ నుంచి రోజుకు 458 క్యూసెక్కులు వస్తోంది. బ్యారేజీ అన్ని గేట్లనుమూసివేయడంతో ఔట్ ఫ్లో లేదు.
ఎల్లంపల్లి బ్యారేజీ కెపాసిటీ 20.17 టీఎంసీలు కాగా, 19.34 టీఎంసీల నీళ్లున్నాయి. క్యాచ్మెంట్ ఏరియా నుంచి రోజుకు 597 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా ఎన్టీపీసీ, ఇతర తాగునీటి అవసరాలకు రోజుకు 597 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. అన్ని గేట్లను ఆఫీసర్లు మూసే శారు.
పంటలు ఎండిపోతయ్..
నీళ్లు ఇస్తారనే ఆశతోనే యాసంగి నాట్లు వేశాం. ఒకవైపు రిజర్వాయర్ ఎండిపోతున్నది. దాన్ని నింపడానికి అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, వెంటనే అధికారులు రిజర్వాయర్ నింపే ప్రయత్నం చేయాలె.
- యాళ్ల తిరుపతిరెడ్డి, రైతు, ధర్మారం
నందిమేడారం నింపాలె
సాగు మొదలై 15 రోజులైంది. నాట్లు పడ్డయి, ఇప్పుడు రిజర్వాయర్ ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నరు. పంటలకు ఎలాగైనా నీరందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలె.
- దేవి కొమురేశ్ , మేడారం, పెద్దపల్లి జిల్లా
తాగునీటికి ఇబ్బందైతది
నందిమేడారంనుంచే ధర్మారం కేంద్రంగాభగీరథ నీటిని సప్లయ్ చేస్తున్నరు.ఇప్పుడు రిజర్వాయర్ ఎండిపోతుండటంతో ఎండాకాలం తాగునీటికి ఇబ్బందవుతుంది.
- కాడే సూర్యనారాయణ, బీజేపీ దళితమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి