ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార హడావుడి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో రేపు ప్రజల మధ్య జగన్ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు కీలకనాయకులు, సెలబ్రిటీలు హాజరు కానున్నారు.
రేపు జగన్ తో ప్రమాణ స్వీకారం చేయించేందుకు గవర్నర్ నరసింహన్ ఈ ఉదయం విజయవాడకు చేరుకున్నారు. బెజవాడలోని గేట్ వే హోటల్ లో గవర్నర్ బస చేస్తారు.
ఇవాళ సీఎం కేసీఆర్ కూడా బెజవాడ వెళ్తున్నారు. ఈ ఉదయం తిరుమల వెంకన్నను దర్శించుకున్న జగన్.. కడప జిల్లాలో పెద్దదర్గా, పులివెందులలో CSI చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం బెజవాడ చేరుకుంటారు.
సాయంత్రం బెజవాడ కనకదుర్గమ్మను గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీకి కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉమ్మడిగా దర్శించుకోనున్నారు.