మమబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: ప్రతి ఉద్యోగి డేటా ప్రైవసీని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. కలెక్టరేట్లో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి సదస్సులతో డిజిటలైజేషన్పై బాధ్యతను పెంచడం, సైబర్ భద్రత గురించి తెలుసుకొనే అవకాశం ఉందన్నారు.
అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, సైబర్ నిపుణుడు, అడ్వకేట్ రూపేశ్ మిత్తల్, హైదరాబాద్ కు చెందిన సూర్యప్రకాశ్ హాజరయ్యారు. ఈమెయిల్ అకౌంట్లు, మొబైల్ ఫోన్లు, వ్యక్తిగత డేటా రక్షణకు సంబంధించిన పలు చిట్కాలు, సైబర్ హైజీన్ పాటించే విధానాలు, మొబైల్ ఫోన్లో భద్రతా సెట్టింగులు తదితర అంశాలను వివరించారు. పాస్వర్డ్ వినియోగం, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్, సాఫ్ట్వేర్ అప్ డేట్స్ ప్రాముఖ్యతను వివరించారు.
మొబైల్ భద్రత కోసం పర్మిషన్లు నిలిపి వేయడం, ధృవీకరించని యాప్లను ఉపయోగించకపోవడం, ప్రైవసీ సెట్టింగ్లపై పలు సూచనలు చేశారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేందర్ గౌడ్, డీఏవో జాన్ సుధాకర్, హౌసింగ్ పీడీ శంకర్ నాయక్, డీపీవో సుధాకర్ రెడ్డి, డీపీఆర్వో రశీద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఖలీల్, తహసీల్దార్లు, ఎంపీడీలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
