నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో 2021 నివేదిక విడుదల

నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో 2021 నివేదిక విడుదల

నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో 2021 నివేదిక విడుదల చేసింది. గంజాయి సరఫరాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నట్టు నివేదిక తెలిపింది. గతేడాది స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలపై నివేదిక రిలీజ్ చేసిన ఎన్సీబీ... దేశవ్యాప్తంగా ఏడు లక్షల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు స్పష్టం చేసింది. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నుండి 26% గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు... ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే రెండు లక్షల కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. రెండో స్థానంలో ఒడిస్సా నిలవగా.. 50 శాతానికి పైగా ఆంధ్ర, ఒడిస్సా రాష్ట్రాల నుండే గంజాయి సాగు జరుగుతున్నట్టు చెప్పుకొచ్చింది. గతేడాది ఏపీలో 18 కిలోల హాశిష్ ఆయిల్ స్వాధీనం చేసుకోగా.. గంజాయి సరఫరాపై 1775 కేసులు నమోదైనట్టు నివేదికలో పేర్కొంది. ఏపీలో గంజాయి తరలిస్తూ పట్టుబడిన 4202 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపింది.

హెరాయిన్ కేసుల్లో మొదటి స్థానంలో గుజరాత్ నిలిచినట్టు ఎన్సీబీ విడుదల చేసిన రిపోర్ట్ లో తెలిపింది. దేశ వ్యాప్తంగా 7618 కిలో ల హెరాయిన్ పట్టుకున్నారని.. అత్యధికంగా గుజరాత్ లో 3,334 కిలోల హెరాయిన్ లభ్యమైనట్టు చెప్పింది. హెరాయిన్ కేసుల్లో రెండో స్థానంలో నిలిచిన యూపీలో 1,337 కిలోల హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు రిపోర్ట్ లో తెలియజేశారు. గతేడాది తెలంగాణలో 35,270 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోగా... ఎన్సీబీ నివేదిక ప్రకారం అత్యధిక మత్తుపదార్థాల ప్రభావం పంజాబ్ లో ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.