అనంతనాగ్: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్అయింది. అయితే, ఈ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆమె డ్రైవర్, వ్యక్తిగత భద్రతా సిబ్బందిలోని ఓ పోలీసు అధికారికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతనాగ్ జిల్లాలోని సంగమ్ వద్ద గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించేందుకు ఆమె ఖానాబాల్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఆమె ప్రయాణిస్తున్న స్కార్పియో వెహికల్.. మరో కారును ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్లో ముఫ్తీ వెహికల్ తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ఘటన అనంతరం ఆమె యథావిధిగా ఖానాబాల్ కు వెళ్లిపోయారు. కాగా.. దేవుడి దయవల్ల ముఫ్తీ, ఆమె భద్రతా అధికారులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారని ముఫ్తీ కూతురు ఇల్తిజా ఎక్స్ లో పోస్ట్ చేశారు. తాను క్షేమంగా ఉన్నానని, తన కోసం ప్రార్థించిన అందరికీ ముఫ్తీ ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన తన డ్రైవర్, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు.
