హర్యానా : రోహ్తక్లో జరిగిన అండర్-23 జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఆతిథ్య హర్యానా అన్ని విభాగాల్లో సత్తా చాటింది. పురుషుల ఫ్రీస్టైల్, గ్రీకో-రోమన్, మహిళల విభాగాల్లో జట్టు ఛాంపియన్షిప్లను కైవసం చేసుకుని ఆధిపత్యం ప్రదర్శించింది. పురుషుల ఫ్రీస్టైల్లో 200 పాయింట్లు, గ్రీకో-రోమన్లో 195, మహిళల విభాగంలో 183 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
ఫ్రీస్టైల్, గ్రీకో-రోమన్ విభాగాల్లో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్ఎస్సీబీ) రన్నరప్గా నిలవగా, మహిళల విభాగంలో మహారాష్ట్ర రెండో స్థానం దక్కించుకుంది. వివిధ బరువు విభాగాల్లో హర్యానాకు చెందిన పరాస్, వినీత్ దహియా, తుషార్, కీర్తి, జ్యోతి, రీనా, సిమ్రన్ స్వర్ణ పతకాలు సాధించారు. ఎస్ఎస్సీబీ తరఫున నరేందర్, సహిల్ దలాల్, ఖుందోంగ్బామ్, సాగర్ సింగ్, దీపక్ పునియా బంగారు పతకాలు గెలిచారు. మహిళల విభాగంలో మధ్యప్రదేశ్కు చెందిన ప్రియాంశి ప్రజాపత్, చండీగఢ్కు చెందిన ఖుషీ రాణి, మహారాష్ట్రకు చెందిన అమృత, వేదిక కూడా స్వర్ణ పతకాలు సాధించారు. యువ రెజ్లర్ల ప్రతిభ భారత రెజ్లింగ్ భవిష్యత్తుకు బలమని భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
