న్యూఢిల్లీ : వచ్చే ఏడాది రూపీ డినామినేటెడ్ బాండ్స్ ఇష్యూ ద్వారా ఫండ్స్ సమీకరించాలని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్లాన్ చేస్తోంది. ఇండియాలోని ప్రాజెక్టులకు అవసరమైన ఫండ్స్ కోసం ఈ విధంగా రూపీ బాండ్స్ఇష్యూ చేసే ఆప్షన్ పరిశీలిస్తున్నట్లు ఎన్డీబీ సీనియర్ ఆఫీసర్ ఒకరు మంగళవారం వెల్లడించారు. లోకల్ కరెన్సీ రిసోర్సెస్ సేకరించడం అనేది ఎన్డీబీ వ్యూహంలో ఒక భాగమని, మొత్తం రిసోర్సెస్లో 30 శాతాన్ని ఈ రూపంలో సమీకరిస్తామని ఎన్డీబీ చీఫ్ రిస్క్ ఆఫీసర్ అనిల్ కిషోరియా చెప్పారు.
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా (బ్రిక్స్ దేశాలు) లు కలిసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ను 2014 లో షాంఘై హెడ్క్వార్టర్స్గా ఏర్పాటు చేశాయి. ఇటీవలే సౌత్ ఆఫ్రికా కరెన్సీ ర్యాండ్లోనూ నిధులు సమీకరించినట్లు కిషోరియా వెల్లడించారు. వచ్చే ఏడాది రూపీ డినామినేటెడ్ బాండ్స్ ఇష్యూకు అవసరమైన అనుమతులు వస్తాయని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు.
ఎంత మొత్తం సేకరించేదీ ఇప్పుడే చెప్పలేమని అన్నారు. లోకల్ కరెన్సీలో నిధులు సమీకరించడం వల్ల ఫారెక్స్ రిస్క్ తగ్గడంతోపాటు, ఫైనాన్సింగ్ సులభమవుతుందని ఆయన వివరించారు. ఢిల్లీ–మీరట్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, ముంబై, ఇండోర్ మెట్రో వంటి ఇంపార్టెంట్ ప్రాజెక్టులకు ఎన్డీబీ డబ్బు ఇచ్చినట్లు చెప్పారు. రాజస్థాన్, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్లలో వాటర్ ప్రాజెక్టులకు, మేఘాలయాలో ఎకో టూరిజమ్ ప్రాజెక్టులకు కూడా తాము నిధులు సమకూర్చినట్లు కిషోరియా వెల్లడించారు.