
- స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్కు ఎన్డీఎస్ఏ లేఖ
హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి తాము అడిగిన సమాచారం ఇంకా ఇవ్వలేదని, వెంటనే ఇవ్వాలని కోరుతూ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్కు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజీలోని కుంగిన బ్లాక్ను ఎన్డీఎస్ఏలోని ఆరుగురు నిపుణుల కమిటీ పరిశీలించిందని, కుంగుబాటుకు దారి తీసిన పరిణామాలపై స్టడీ చేయడానికి పూర్తి డేటా ఇవ్వాలని తాము కోరామని గుర్తు చేసింది. 2023 నవంబర్ 1న తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశామని, బ్యారేజీ కుంగుబాటుకు కారణాలపై తమ అబ్జర్వేషన్తో ప్రాథమిక నివేదిక ఇచ్చామని తెలిపింది.
దీనిపై తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ ఏడో తేదీన లేఖ రాశారని చెప్పింది. ‘‘బ్యారేజీకి సంబంధించిన జియోలాజికల్ సెక్షన్, సెక్షనల్ డ్రాయింగ్స్ను ప్రత్యేకంగా సమర్పించాలని కోరాం. బ్యారేజీకి సంబంధించిన అదనపు సమాచారం కూడా ఇవ్వాలని అడిగాం. బ్యారేజీకి పోటెత్తిన వరదతో డౌన్స్ట్రీమ్లోని కట్ ఆఫ్ బ్లాక్ అయినట్టుగా తేలింది. ఈ క్రిటికల్ డిజైన్ను స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ సమాచారం ఇంతవరకు మాకు చేరలేదు. క్వాలిటీ కంట్రోల్ మానిటరింగ్, థర్డ్ పార్టీ ఎగ్జామినేషన్ డేటా సహా ఇతర వివరాలు ఇస్తే బ్యారేజీ పునరుద్ధరణ విషయంలో ఎలా ముందుకెళ్లాలో సలహాలు
సూచనలు ఇస్తామని గతంలోనే చెప్పాం. బ్యారేజీలో కుంగిన ప్రాంతాన్ని ఐసోలేట్చేసి, దాని పునాది భాగంలోని నీటిని తొలగించాలని డిసెంబర్ 6న మేము రాసిన లేఖలో సూచించాం. ఆ తర్వాతే బ్యారేజీ కుంగడానికి కారణాలను అన్వేషిస్తూ సర్వే చేపట్టాలని చెప్పాం. ఈ ఇన్వెస్టిగేషన్స్కు సంబంధించిన డేటా కూడా ఇంతవరకు మాకు పంపలేదు. వెంటనే ఈ సమాచారం మాకు పంపాలి’’ అని లేఖలో కోరింది.