
దేశ రాజధాని ఢిల్లీలో ఒకే సారి దాదాపు 100 పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. మే 1న బుధవారం ఉదయం ఈ మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాయి. ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లను ఖాళీ చేయించాయి. పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. ద్వారక,చాణక్యపురి, మయూర్ విహార్, వసంత్ కుంజ్, సాకేత్తో పాటు నోయిడాలోని కనీసం 12 పాఠశాలలకు ఈమెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. కొన్నిస్కూళ్లలో ఈ రోజు పరీక్షలు జరుగుతున్నాయి.
బెదిరింపుల నేపథ్యంలో వాటిని మధ్యలోనే ఆపి విద్యార్థులను ఇంటికి పంపించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఆయా స్కూళ్లకు చేరుకుని పిల్లలను తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ పాఠశాలల ప్రాంగణాల్లో పోలీసులు బాంబ్ డిటెక్షన్ బృందంతో తనిఖీలు చే స్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద, పేలుడు పదార్థాలు లభించలేదని తెలుస్తోంది. బెదిరింపులకు పాల్పడిన ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ-మెయిల్ ఐపీ అడ్రస్లను బట్టి విదేశాల నుంచి దీన్ని పంపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దాదాపు 2 నెలల క్రితం ఆర్కే పురంలోని డీపీఎస్లో కూడా ఇలాంటి బెదిరింపు వచ్చింది. ఈ-మెయిల్లో బెదిరింపు పంపడంతో వెంటనే పాఠశాలను ఖాళీ చేయించారు. 2023లో సెప్టెంబర్ లో లాల్ బహదూర్ శాస్త్రి స్కూల్లో బాంబు బెదిరింపు బూటకమని తేలింది.