- అప్పులు కావాలి.. ఆదుకోండి.. కేంద్రానికి రాష్ట్ర సర్కారు రిక్వెస్ట్
- గ్యారంటీ, ఎన్సీడీసీ లోన్ల కోసం తంటాలు
- ఎన్నికల టైంలో స్కీములకు నిధుల కొరతతో టెన్షన్
- మొదలై నెలవుతున్నా ఐదెకరాలకే ఆగిపోయిన రైతుబంధు
- జులైలోనే ప్రారంభిస్తామన్న దళిత బంధు, గృహలక్ష్మి స్కీములు ఇప్పటికీ మొదలు కాలే
- బీసీలకు రూ. లక్ష సాయం స్కీమ్ అంతంతగానే ప్రారంభం
- మైనార్టీలకు లక్ష సాయానికి, పెంచిన డైట్ చార్జీలకూ తిప్పలు
హైదరాబాద్, వెలుగు: అప్పుల కోసం రాష్ట్ర సర్కార్ తంటాలు పడుతున్నది. గ్యారంటీ అప్పులకు నిబంధనలు అడ్డొస్తుండటం, ఆర్బీఐ నుంచి నిర్దేశించిన మేరకే లోన్లు వస్తుండటంతో స్కీముల అమలుపై టెన్షన్ పడుతున్నది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖజానా ఖాళీ కావడం ఒకవైపు.. పథకాలు అమలు కాకుంటే కార్యకర్తలే ఓడిస్తారని లీడర్లు చెప్తుండటం మరో వైపు ఇబ్బందికరంగా మారింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి సఖ్యత సంకేతాలు పంపుతూ అప్పులకు అనుమతులను కోరుతున్నది. కేంద్రం నిర్వహించే మీటింగులకు మొన్నటి దాకా రాష్ట్ర ప్రభుత్వం దూరంగా ఉంటూ వచ్చింది. అయితే.. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ భేటీకి మంత్రి హరీశ్ హాజరయ్యారు. సీఎస్, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్, సెక్రటరీలు చేస్తున్న ఢిల్లీ పర్యటనల్లో నిధులు, అప్పులపైనే ఫోకస్ పెట్టినట్లు తెలిసింది.
తెలంగాణ రాష్ట్ర నీటి అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (టీఎస్డబ్ల్యూఆర్ఐడీసీఎల్), పీఎఫ్సీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)తో పాటు ఇతర గ్యారంటీ అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గొర్రెల స్కీంకు సంబంధించి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) అప్పు రూ.5 వేల కోట్లకు సంబంధించి నిధుల రిలీజ్ చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మొత్తం ఏకకాలంలో కాకపోయినా దశలవారీగా అయినా కనీసం రూ. 8 వేల కోట్లకు అయినా పర్మిషన్ వచ్చేలా సహకరించాలని ప్రతిపాదించినట్లు తెలిసింది.
రెగ్యులర్ అప్పులకు తోడుగా.. గ్యారంటీ అప్పులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి యావరేజ్గా ప్రతి నెలా రూ.4 వేల కోట్ల నుంచి 5 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నది. ఇదంతా బడ్జెట్లో పెట్టుకున్న దానికి తగ్గట్టుగా ఎఫ్ఆర్బీఎం పరిధిలో చేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24)లో రూ. 40,615 కోట్లు బాండ్ల అమ్మకంతో సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్నది. దీంట్లో ఇప్పటిదాకా రెగ్యులర్ అప్పుల కింద దాదాపు రూ.18 వేల కోట్లు తీసుకున్నది. ఈ జులై నెలలోనే ఇప్పటిదాకా రూ.5 వేల కోట్లు తీసుకున్నట్లు ఆర్బీఐ లెక్కలు వెల్లడిస్తున్నాయి. జులై 18న రూ.2 వేల కోట్లు, జులై 11న వెయ్యి కోట్లు, జులై 4న 2 వేల కోట్లు తీసుకున్నది. అవసరమైతే ఈ నెలాఖారులో ఇంకో రూ.2 వేల కోట్లు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నది. ఇవి కాకుండా వేస్ అండ్మీన్స్ కింద అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు రూ. 1,000 కోట్ల నుంచి 1,500 కోట్లు తీసుకుంటున్నది. ప్రస్తుతం ఇవి సరిపోకపోవడంతో గ్యారంటీ అప్పులు తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నది. దీనికి కేంద్రం, ఆర్బీఐ గత ఆర్థిక సంవత్సరం నుంచి కొన్ని నిబంధనలను అమలు చేస్తున్నాయి. గ్యారంటీ అప్పు ఎట్లా తీరుస్తారనేది నివేదిస్తేనే వాటిని తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. దీంతో రాష్ట్ర సర్కార్ మొన్నటి దాకా గ్యారంటీ అప్పులను లైట్ తీసుకున్నది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటం.. నిధుల కొరత మొదలవడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. కనీసం గ్యారంటీ అప్పులనైనా పథకాలకు మళ్లించాలని చూస్తున్నది. అందులో భాగంగానే ఆర్ఈసీ, టీఎస్డబ్ల్యూఆర్ఐడీసీఎల్, పీఎఫ్ సీ, ఎన్సీడీసీలతో పాటు ఇతర రాష్ట్ర కార్పొరేషన్ల ద్వారా గ్యారంటీ అప్పులకు తాపత్రాయ పడుతున్నది.
స్కీముల గండం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కీములు కూడా ఖజానాలో పైసల్లేక ఆగిపోయాయి. జూన్ మొదటి వారంలో అమలు చేయాల్సిన రైతుబంధు జులై నెల చివరి దశకు చేరుకున్నా పూర్తి కాలేదు. రైతుబంధు సొమ్ము జమ చేయడం మొదలై దాదాపు నెల కావొస్తున్నది. ఇప్పటి దాకా 5 ఎకరాల లోపు ఉన్న పట్టాదారులకు ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయం అందింది. మిగిలిన వారికి ఎదరుచూపులు తప్పడం లేదు. ఇంకో రూ.2,500 కోట్లు అయితేనే రైతుబంధు పూర్తవుతుంది. ఇక జులైలోనే మొదలుపెడుతామని చెప్పిన దళితబంధు, గృహలక్ష్మి స్కీముల అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇంతవరకు ప్రారంభించలేదు. బీసీ చేతివృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సాయం స్కీమ్ గందరగోళంగా మారింది. మొదటిదశలో నియోజకవర్గానికి కేవలం 50 మందికే ఇచ్చారు. ఈ లెక్కన 7 వేల మందికి లోపే సాయం అందింది. కానీ, ఈ స్కీం కోసం దాదాపు 5.20 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. తాజాగా పెంచిన దివ్యాంగుల పెన్షన్కు, కొత్తగా మైనార్టీలకూ మొదలుపెట్టనున్న రూ. లక్ష ఆర్థిక సాయం అమలు ఎట్లా అనే దానిపై ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పెంచిన డైట్ చార్జీలకూ ఇబ్బందులు తప్పేలా లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ టైం కనుక ఇప్పటికే రూ. వేల కోట్లు పెండింగ్లో ఉన్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, స్కాలర్షిప్లు, కేసీఆర్ కిట్, మన ఊరు – మన బడి వంటి వాటికి నిధులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే ఆ నిధులు ఎట్లా సర్దుబాటు చేయాలనేది తలకు మించిన భారంగా మారింది.
ఖజానా ఖల్లాస్
రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పరిస్థితి దారుణమైన స్టేజ్ లో ఉందని ఆఫీసర్లు, ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ పేర్కొంటున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 4.60 లక్షల కోట్లకు చేరింది. మరోవైపు స్టేట్ ఓన్ ఇన్కం పడిపోయింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపు లకే ప్రతినెలా వారం, పది రోజులు అన్నింటికి నిధుల విడుదల ఆపి మరీ చేస్తున్నారు. ఇట్లా నడిస్తే ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయని భావిం చే సర్కార్ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం, గ్యారంటీ అప్పులు తెచ్చుకోవడం, ఔటర్ రింగ్ రోడ్డు టీవోటీ సొమ్మును త్వరగా ప్రభుత్వ ఖజానాలో జమ చేసుకోవడం, జీవో 58, 59 అప్లికేషన్లు పూర్తి చేయడం వంటివి వేగవంతం చేసింది.