
- 904 టీఎంసీల వాటా సాధించుకొని తీరాలి
- న్యాయనిపుణులు, ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ సూచన
- ఈ నెల 23, 24, 25 తేదీల్లో కృష్ణా ట్రిబ్యునల్లో తుది వాదనలు
- గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీకీ 512 టీఎంసీలు కట్టబెట్టి తెలంగాణకు అన్యాయం చేసింది
- పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 10 టీఎంసీలను ఏపీ మళ్లిస్తున్నది
- పట్టిసీమ, పులిచింతల, చింతలపాడు వరకు అక్రమ నీటి
- తరలింపుపై ట్రిబ్యునల్కు ఆధారాలు సమర్పించాలి
- మంత్రి ఉత్తమ్ స్వయంగా విచారణలో పాల్గొంటారని సీఎం వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని న్యాయ నిపుణులు, ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కృష్ణాలో నికర, మిగులు, వరద జలాలేవైనా సరే.. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటాలో ఒక చుక్క నీరు కూడా వదులుకునేది లేదని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టీఎంసీల నీటి వాటాను సాధించుకునేందుకు పట్టుబట్టాలని అన్నారు.
అందుకు అవసరమైన ఆధారాలన్నీ వెంటనే సిద్ధం చేసి న్యాయ నిపుణులకు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 23, 24, 25వ తేదీల్లో ఢిల్లీలో కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తెలంగాణ తుది వాదనలు విని పించాల్సి ఉందని, తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేలా ప్రభుత్వం తరుఫున బలమైన వాదనలు వినిపించాలని అన్నారు. స్వయంగా మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఈ విచారణలో పాల్గొంటార ని తెలిపారు.
ఈ సందర్భంగా ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై శనివారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఇంత కాలం కృష్ణా నదీ జలాల్లో జరిగిన అన్యాయానికి అడ్డు కట్ట వేసి, మనకు రావాల్సిన ప్రతి నీటిబొట్టును దక్కించుకునేలా మన వాదనలు ఉండాలన్నారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలన్నీ ట్రిబ్యునల్కు సమర్పించాలని సూచించారు.
ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు కృష్ణా నదిపై ఉన్న, నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులు, అసంపూర్తిగా ఉన్నవి, నిర్లక్ష్యంగా వదిలేసిన వాటి వివరాలన్నీ ట్రిబ్యునల్ ముందు ఉంచాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవోలు, మెమోలు, డాక్యుమెంటన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్కు అందించాలని చెప్పారు.
ఆ జిల్లాలకు కృష్ణా జలాలు తప్ప గత్యంతరం లేదు
శ్రీశైలం రిజర్వాయర్ నిండకముందే, పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా రోజుకు 10 టీఎంసీల నీటిని ఏపీ మళ్లిస్తున్నదని, ఇతర బేసిన్లకు తరలించుకుపోతున్నదని సీఎం రేవంత్ అన్నారు. ఎక్కడపడితే అక్కడ కాల్వల సామర్థ్యం పెంచుకోవడంతోపాటు పట్టిసీమ, పులి చింతల, చింతలపాడు వరకు ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్న అంశాలన్నీ ఆధారాలతో సహా ట్రిబ్యునల్కు నివేదించాలని, అందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
కృష్ణా నీటి ని ఏపీ అక్రమంగా మళ్లించడంతో శ్రీశైలం, నాగార్జున సాగర్తో పాటు పులిచింతల వద్ద ఉన్న జల విద్యుత్తు ప్రాజెక్టులు మూతపడే ప్రమాదం ముంచుకు వచ్చిందన్నారు. తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తుకు విఘాతం కలుగుతున్నదని చెప్పారు. ఈ విషయాలన్నీ ట్రిబ్యునల్ ఎదుట వాదనలుగా విని పించాలని ఆదేశించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావడంతో తెలంగాణకు రావాల్సిన హక్కులు, నీటి వాటాలను సాధించుకునేందుకు అన్ని అర్హతలు న్నాయని చెప్పారు.
సాగునీటి, తాగునీటి అవసరాలతోపాటు మెట్ట, కరువు ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కృష్ణా జలాలు తప్ప గత్యంతరం లేదనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే కృష్ణా జలాశయాలను తెలంగాణ వినియోగించుకోలేకపోయిందని గుర్తు చేయాలన్నారు. తెలంగాణ తరఫున వాదనలను వినిపించేందు కు ఇదే సరైన అవకాశమని సీఎం అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంతో పాటు, కృష్ణా నదీ జలాల్లో రావాల్సిన వాటాల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే వాదనలు కావడంతో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జారవిడుచుకోవద్దని న్యాయ నిపుణులకు సూచించారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ కె.వోహ్రా, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీ అంజద్ హుస్సేన్, సీఎంవో సెక్రెటరీ మాణిక్రాజ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
గత సర్కారు తీరని ద్రోహం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో రావాల్సిన నీటి వాటాలను సాధించకపోగా.. తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకీ 512 టీఎంసీల వాటాకు ఒప్పుకొని రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. అప్పటి సీఎం కేసీఆర్ 299 టీఎంసీల వాటాకు ఒప్పుకున్న విషయాన్ని ఏపీ ఇప్పుడు ట్రిబ్యున ల్ ముందుకు తెచ్చిందని న్యాయ నిపుణులు సీఎంకు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల వినియో గంలో తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని రేవంత్ అన్నారు. గడిచి న పదేండ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించడంలో దారుణంగా విఫలమైందన్నారు.
కృష్ణాపై తలపెట్టిన పాలమూరు నుంచి డిండి వరకు ప్రాజెక్టులన్నింటినీ పెండింగ్లో పెట్టిందని మండిపడ్డారు. నీటి వాటాల విషయంలో తీరని ద్రోహం చేసిందన్నారు. దిగువ రాష్ట్రాల హక్కులతోపాటు నదీ వాటాల పంపిణీ న్యాయసూత్రాల ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల్లో 904 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉందని, అందుకు తగ్గట్టుగా వాదనలు సిద్ధం చేయాలని సూచించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోయిందని, ఆ విషయాన్ని ట్రిబ్యునల్ ముందుకు తీసుకురావాలని చెప్పారు.