OMR షీట్‌పై టీ (TEA) పడింది.. హైకోర్టులో పిటిషన్ వేసిన యువతి

OMR షీట్‌పై  టీ (TEA) పడింది..  హైకోర్టులో పిటిషన్ వేసిన యువతి

డాక్టర్ కావాలని కలలు కంటున్న ఓ యువతి .. తన కలలను నాశనం చేసిన  పరీక్ష ఇన్విజిలేటర్‌పై రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2023 మే 7న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షలో18 ఏళ్ల  దిశా శర్మ  వివేక్ టెక్నో స్కూల్‌లో నీట్ పరీక్షకు హాజరైంది. ఆ పరీక్ష హాలులో ఓ ఇన్విజిలేటర్ టీ కప్పు తీసుకుని అటు ఇటుతిరుగుతున్నాడు. 

ఈ క్రమంలో పొరపాటున ఆ  ఇన్విజిలేటర్ తాగుతున్న టీ కప్పు పరీక్ష రాస్తున్న దిశా OMR షీట్‌పై పడింది. ఆ తర్వాత పరీక్షను పూర్తి చేయడానికి ఆమెకు అదనపు సమయం కూడా ఇవ్వలేదు. దీంతో OMR షీట్ లో ఆమె రాసిన సమాధానాలన్ని తొలగిపోయాయి.  అంతేకాకుండా ఆమె రాయాల్సిన మరో 17 ప్రశ్నలు కూడా  తొలగిపోయాయి.  పరీక్ష ముగిసిన తర్వాత దిశ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ అతను స్పందించలేదు. 

ఈ క్రమంలో దిశా రాజస్థాన్ హైకోర్టులో ఇన్విజిలేటర్‌పై పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ అనిల్ ఉప్మాన్‌లతో కూడిన డివిజనల్ బెంచ్..  దిశా ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ తో పాటుగా పరీక్షా కేంద్రంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీతో పాఠశాల ప్రిన్సిపాల్‌, ఇన్విజిలేటర్  2023 జూలై 4న కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.

12వ తరగతిలో 99 శాతం మార్కులు సాధించిన దిశా శర్మ ఎగ్జామినర్ పొరపాటు వల్ల డాక్టర్ కావాలనే కల అసంపూర్తిగా మిగిలిపోయింది.