- ఆదేశాలు జారీ చేసిన నేషనల్ మెడికల్ కమిషన్
హైదరాబాద్, వెలుగు: నీట్-పీజీ– 2025 అడ్మిషన్ల వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఏప్రిల్ 8 వరకు గడువు విధిస్తూ దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. 2025–-26 విద్యా సంవత్సరానికి గానూ పీజీ మెడికల్ కోర్సుల్లో (ఎండీ/ఎంఎస్ /డిప్లొమా) చేరిన విద్యార్థుల సమాచారాన్ని నిర్ణీత గడువులోగా అడ్మిషన్ మానిటరింగ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని, కేవలం ఆన్లైన్ డేటానే పర్యవేక్షణకు ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేసింది. అడ్మిషన్లు పారదర్శకతతో, మెరిట్ ప్రాతిపదికన జరగాలని సూచించింది.
ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినా, నిబంధనలు అతిక్రమించినా సంబంధిత విద్యార్థులను కోర్సు నుంచి డిశ్చార్జ్ చేయడంతో పాటు కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏవైనా లాగిన్ సమస్యలు ఉంటే వెంటనే ఎన్ఎంసీని సంప్రదించాలని, వివరాల నమోదుకు హార్డ్ కాపీలు పంపాల్సిన అవసరం లేదని కమిషన్ ఉత్తర్వుల్లో వెల్లడించింది.
