
- ఆలిండియా టాపర్గా రాజస్థాన్కు చెందిన మహేశ్ కుమార్
- సెకండ్, థర్డ్ ప్లేసుల్లో ఉత్కర్ష్ అవధీయ, కృషంగ్ జోషి
- ఏపీ నుంచి 36,776 మంది క్వాలిఫై.. టాప్ 100లో ఆరుగురు
- టాప్ 10లో తెలంగాణ, ఏపీ నుంచి ఒక్కరికీ దక్కని చోటు
న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు: మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) శనివారం విడుదల చేసింది. తెలంగాణ నుంచి 70,259 మంది నీట్ పరీక్ష రాయగా, వారిలో 41,584 మంది క్వాలిఫై అయ్యారు. ఆలిండియా టాప్ 100లో మనోళ్లు ఐదుగురు ఉన్నారు. కాకర్ల జీవన్ సాయికుమార్ 18వ ర్యాంక్, షణ్ముఖ నిశాంత్ 37, మంగారి వరుణ్ 46, యండ్రపాటి షణ్ముఖ్ 48, బిదీష మాఝీ 95వ ర్యాంక్ సాధించారు. ఇక ఏపీ నుంచి 36,776 మంది అర్హత సాధించగా.. దర్బా కార్తీక్ రామ్ 19వ ర్యాంక్, కొడవటి మోహిత్ సాయిరామ్ 56, దేశిన సూర్యచంద్ర 59, పొదిల అవినాశ్ 64, యర్రా సమీర్కుమార్ 70, తుమ్మూరి శివ మణిదీప్ 92వ ర్యాంకు సాధించారు. ఈసారి టాప్ 10లో తెలంగాణ, ఏపీ నుంచి ఎవరికీ చోటు దక్కలేదు. కాగా, రాష్ట్రంలో 33 ప్రభుత్వ, రెండు డీమ్డ్ యూనివర్సిటీలతో కలిపి 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 8,515 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో డీమ్డ్ యూనివర్సిటీల్లో 400 వరకు ఉన్నాయి.
అత్యధికంగా యూపీ నుంచి 1.70 లక్షల మంది అర్హత..
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నీట్ యూజీ పరీక్షను గత నెల 4న ఎన్టీయే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 22.09 లక్షల మంది పరీక్ష రాయగా, 12.36 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో ఓబీసీ అభ్యర్థులు 5.6 లక్షలు, జనరల్ అభ్యర్థులు 3.38 లక్షలు, ఎస్సీ 1.68 లక్షలు, ఎస్టీ 67,234, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు 97,085 మంది ఉన్నారు. రాజస్థాన్కు చెందిన మహేశ్ కుమార్ ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించగా.. మధ్యప్రదేశ్కు చెందిన ఉత్కర్ష్ అవధీయ సెకండ్, మహారాష్ట్రకు చెందిన కృషంగ్ జోషి థర్డ్, ఢిల్లీకి చెందిన మృనాల్ కిశోర్ ఝా ఫోర్త్ ర్యాంక్ సాధించారు.
ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్ ఐదో ర్యాంక్ సాధించి మహిళా విభాగంలో టాపర్గా నిలిచారు. నీట్లో అర్హత సాధించిన 12.36 లక్షల మందిలో 7.2 లక్షల మంది అమ్మాయిలు, 5.14 లక్షల మంది అబ్బాయిలు ఉన్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 1.70 లక్షల మంది అర్హత సాధించగా.. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (1.25 లక్షలు), రాజస్థాన్(1.19 లక్షలు) నిలిచాయి. కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 1,08,000 సీట్లు ఉండగా.. అందులో దాదాపు 56 వేలు గవర్నమెంట్ కాలేజీల్లో, మిగిలిన 52 వేలు ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నాయి. పోయినేడాది 23.33 లక్షల మంది నీట్ యూజీ ఎగ్జామ్ రాయగా,13.15 లక్షల మంది క్వాలిఫై అయ్యారు.
త్వరలో కౌన్సెలింగ్..
నీట్ ఫలితాలతో పాటు కటాఫ్ మార్కులను ఎన్టీయే వెల్లడించింది. తెలంగాణలో 85% స్టేట్ కోటా సీట్ల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ, 15% ఆలిండియా కోటా సీట్ల కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి. కౌన్సెలింగ్ తేదీలు, మెరిట్ లిస్ట్ వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.