- 3 కమిషనరేట్లలో పోలీసుల నిఘా నిల్
- వీఐపీలు,ఉన్నతాధికారుల ఏరియాలకే పరిమితం
- సిటీలో బస్తీలు,శివారుకాలనీల్లో పెట్టని నిఘా
- అర్ధరాత్రి ఫిర్యాదులకు ఆలస్యంగా స్పందన
- ఉన్నతాధికారులకు సిటిజన్ల కంప్లయింట్లు
హైదరాబాద్, వెలుగు: పోలీస్ పెట్రోలింగ్కు వ్యవస్థకు సుస్తీ చేసింది. గ్రేటర్ సిటీలోని కమిషనరేట్లలో రాత్రిపూట పెట్రోలింగ్ చేయడం లేదు. వీఐపీలు, ఎమ్మెల్యే, ఎంపీలు, పోలీస్ ఉన్నతాధికారులు ఉండే ప్రాంతాల్లో మినహా బస్తీలు, సిటీ శివారులోని కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో నిఘా పెట్టడడం లేదు. వరుస చైన్ స్నాచింగ్స్, చోరీలు జరిగిన ఘటనలప్పుడే హడావుడి చేస్తుంటారు. తర్వాత మళ్లీ మామూలే. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులోకి రాక ముందు నుంచే పెట్రోలింగ్ వెహికల్స్ తిరగడం లేదని సిటిజన్స్ ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోలీసు ఉన్నతాధికారులకు కూడా కంప్లయింట్ చేస్తున్నారు.
హాట్ స్పాట్స్లో నిఘా పెట్టట్లే..
3 కమిషనరేట్ల పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్కు రెండు చొప్పున పెట్రోలింగ్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో పెట్రోలింగ్ వెహికల్లోహెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు డ్యూటీలో ఉంటారు. రాత్రి11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు తమ ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహించాలి. డయల్100కువచ్చేకాల్స్తో పాటు స్టేషన్కి వచ్చే ఎమర్జెన్సీ కాల్స్కు స్పందిస్తూ 8 నుంచి 10 నిమిషాలవ్యవధిలోనే స్పాట్కు చేరుకోవాలి. పీఎస్ పరిధిలోని క్రైమ్ హాట్ స్పాట్స్, చోరీలకు అవకాశం ఉన్నప్రాంతాల్లో సైరన్ వేసుకుని గస్తీ నిర్వహించాలి. స్థానికుల నుంచి పాయింట్ బుక్లో ఎంట్రీ తీసుకోవాలి.
విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యం
కొంతకాలంగా పెట్రోలింగ్ వెహికల్స్ సైరన్ మోగట్లేదు. బోనాల పండగ ప్రారంభమైనప్పటి నుంచి పోలీసులు బందోబస్తులకే పరిమితం అయ్యారు. రాత్రి పెట్రోలింగ్ను మర్చిపోయారు. నైట్ డ్యూటీలో ఉండే సిబ్బంది పెట్రోలింగ్కు బదులు పీఎస్లో నిద్రపోతున్నారనే ఆరోపణలున్నాయి. ఒకవేళ వెళ్తే.. కేవలం 5 నిమిషాలు మాత్రమే తిరిగి వచ్చి పీఎస్కు చేరుకోవడమో లేదా ఏదైనా పబ్లిక్ ప్లేస్లో వెహికల్ పెట్టుకుని కూర్చోవడమో చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అర్ధరాత్రి రోడ్డు ప్రమాదాలు జరిగితే ఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకుంటున్నారు.108 వచ్చిన తర్వాత కూడా పోలీసులు స్పాట్కు చేరుకోని సందర్భాలు ఉంటున్నాయి.
శివారు కాలనీల్లో అర్ధరాత్రి చోరీలు
ప్రధానంగా సిటీ శివారులోని కాలనీల్లో పోలీస్ పెట్రోలింగ్ కనిపించడం లేదు. దీంతో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటి బయట పార్కింగ్ చేసిన బైక్లను ఎత్తుకెళ్తున్నారు. రెండు, మూడు రెక్కీ వేసి.. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 నుంచి 3 గంటల ప్రాంతంలోనే చోరీలు చేస్తున్నారు. దీంతో పాటు బైక్ల్లోని పెట్రోల్ను చోరీ చేస్తున్నారు. ఇలాంటివే రాచకొండ కమిషనరేట్ పరిధి బాలాపూర్లో రెండు ఘటనలు జరిగాయి. ఎయిర్పోర్ట్ రోడ్ సమీపంలోని కాలనీల్లో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా గ్రేటర్లోని 3 కమిషనరేట్లలో నైట్ పెట్రోలింగ్ నిర్లక్ష్యంపై పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి.