కామారెడ్డి జిల్లాలో రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తం

కామారెడ్డి జిల్లాలో రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తం
  • నిరుడు వరదలకు ధ్వంసం,  మళ్లీ వానాకాలం వచ్చినా పట్టించుకోని వైనం
  • మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం
  • ఇబ్బందులు పడుతున్న జిల్లా కేంద్రం జనం 

కామారెడ్డి, వెలుగు : నిరుడు వానాకాలం వరదలకు జిల్లా కేంద్రంలోని పలు రోడ్లు, డ్రైనేజీలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారినా మరమ్మతులు చేయలేదు. మున్సిపల్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదు.. తట్టెడు మన్ను పోయించలేదు. ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. మళ్లీ వానాకాలం వచ్చింది. దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలు ప్రమాదాలకు నిలయంగా మారాయి.  నిరుడు ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు జిల్లా కేంద్రంలో  రోడ్లు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు,  వరద నీటి కాల్వలు ధ్వంసమయ్యాయి.  నిజాంసాగర్ రోడ్డు నుంచి పెద్ద చెరువుకు వెళ్లే మార్గంలోని రోడ్డు కొట్టుకుపోయి, డ్రైనేజీ కూలింది.  

పంచముఖి హనుమాన్ కాలనీ, సైలాన్​బాబా కాలనీ,  వాసవీ నగర్,  బతుకమ్మ కుంట ఏరియాలోని పలు రోడ్లు, వరద నీటి కాల్వలు, డ్రైనేజీలు దెబ్బతిన్నాయి. అశోక్​నగర్ కాలనీ మెయిన్ రోడ్డు గుంతలు ఏర్పడ్డాయి.  కేవలం పంచముఖి హనుమాన్​ టెంపుట్ ఎదురుగా డ్రైనేజీ నిర్మాణం తప్పా.. మిగతా ఏరియాల్లో మరమ్మతుల ఊసేలేదు. ప్రమాదకరంగా మారిన రోడ్ల మీదుగానే వెహికల్స్, గుంతలు ఏర్పడిన ఏరియాల నుంచే  విద్యార్థులు సైకిల్స్​పై  వెళ్తుంటారు.  ఏ మాత్రం అదుపుతప్పినా ప్రమాదం జరిగే వీలుంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వానాకాలంలో రోడ్లపై నీళ్లు పారుతున్నాయి.  విద్యానగర్,  ఎన్జీవోస్ కాలనీ, కాకతీయనగర్, అయ్యప్పనగర్ ఏరియాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరుతోంది. స్టేషన్​రోడ్డు, సిరిసిల్లా రోడ్లపై వర్షపు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. 

ముందస్తు చర్యలు లేవు.. రివ్యూ లేదు.. 

వర్షాకాలంలో జిల్లా కేంద్రంలోని మెయిన్​ రోడ్లు, కాలనీలు జలమయమవుతున్నాయి.  ఏటా ఇదే తంతు జరుగుతున్నా ముందస్తు చర్యల దాఖలాలు లేవు. ఉన్నతాధికారులు రివ్యూ చేసి దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలకు మరమ్మతులు చేయించలేదు.  

ప్రమాదకరంగా రోడ్డు..

జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ రోడ్డు నుంచి పెద్ద చెరువుకు వెళ్లే రోడ్డు గుండా వివిధ కాలనీల ప్రజలు, స్కూల్స్ విద్యార్థులు రాకపోకలు సాగిస్తారు.  వందల సంఖ్యలో బైక్స్​, కార్లు, ఆటోలు తిరుగుతాయి.  నిరుడు వానాకాలంలో డ్రైనేజీ, రోడ్డు కొట్టుకుపోయి పెద్ద గుంత ఏర్పడినా మరమ్మతు చేయలేదు. 3 నెలల క్రితం  రోడ్డు చుట్టూ రెయిలింగ్ వేశారు కానీ గుంతను పూడ్చలేదు. మళ్లీ వానకాలం వచ్చింది. వరద నీటికి రోడ్డు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది.    

కొట్టుకుపోయిన డ్రైనేజీ..

సైలాన్​బాబా కాలనీ, టీచర్స్ కాలనీ ల్లో  వరద నీటి కాల్వలు, డ్రైనేజీలు నిరుటి వానాకాలంలో కొట్టుకుపోగా, మరమ్మత్తులు చేయలేదు. కాల్వలు పూడుకుపోయి, పక్కన రోడ్లు దెబ్బతిన్నాయి.  ఈసారి వరద నీటి ప్రవాహానికి పూడుకుపోయిన కాల్వలు అడ్డుగా మారనున్నాయి. నీటి ప్రవాహం ఇండ్లలోకి వచ్చే ప్రమాదం ఉంది. 

శిథిలమైన బీటీ రోడ్డు..  

అడ్లూర్ నుంచి రామారెడ్డి రోడ్డుకు వెళ్లే సైలాన్​బాబా కాలనీ రోడ్డు దారుణంగా ఉంది. ఎఫ్​సీఐ గోడౌన్ల వెనుక నిరుడు వరదలు వచ్చి రోడ్డు శిథిలమైంది.  మూల మలుపు వద్ద రోడ్డు సగం కోతకు గురై ప్రమాదకరంగా మారింది. నిత్యం వందలాది వెహికల్స్ తిరుగుతుంటాయి. 

త్వరలో మరమ్మతులు చేయిస్తాం

కామారెడ్డి పట్టణంలో దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీల మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నాం. కంకర పొడి మిక్సింగ్​తో మరమ్మతులు చేయాలని నిర్ణయించాం. పనులు త్వరగా చేయించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. రాజేందర్​రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కామారెడ్డి