- కాపాడాలని నేరేడ్మెట్ ముదిరాజ్ సంఘం విజ్ఞప్తి
- హైడ్రా ప్రజావాణికి 53 ఫిర్యాదులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 53 ఫిర్యాదులు వచ్చాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. మల్కాజిగిరి పాత నేరేడ్మెట్ న్యూ విద్యానగర్ కాలనీ సర్వేనంబరు 153/1 లో గల 7 గుంటల స్థలం మండల రెవెన్యూ రికార్డుల ప్రకారం స్మశానవాటికగా నమోదైంది.
దీన్ని ఇంటి స్థలంగా పేర్కొంటూ కబ్జా చేస్తున్నారని.. కాపాడాలని నేరేడ్మెట్ ముదిరాజ్ సంఘం విజ్ఞప్తి చేసింది. కుత్బుల్లాపూర్ మండలం, గ్రామంలోని సర్వే నంబరు 148 , 155 సర్వే నంబర్ల మధ్య ఉన్న ప్రభుత్వ భూమి మొగుల్ల చెరువు బఫర్లో ఉన్న 23 గంటల స్థలం కబ్జాకు గురవుతోందని, ఆపాలని ఫిర్యాదు చేశారు.
శేరిలింగంపల్లి మండలంలోని గోపన్నపల్లిలో 6.18 ఎకరాల్లో వసుంధర ఎస్టేట్స్ పేరిట 1999లో లేఅవుట్ వేయగా.. ఇందులోని 2.10 ఎకరాల భూమిని వ్యవసాయ భూమిగా మళ్లీ అమ్మేశారని, పాత లేఅవుట్ ప్రకారం అందులోని రోడ్లు, పార్కులు కాపాడాలని కోరారు. అత్తాపూర్ సమీపంలోని మొఘల్ కా నాలా ప్రాంతంలో కొందరు మూసీలో ఆక్రమణలకు పాల్పడుతున్నారని, రోజుకు సుమారు 50 ట్రక్కుల చెత్తను అక్కడ పోసి చదును చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు.
దేవాదాయ శాఖకు చెందిన భూమిని నకిలీ క్లెయిమ్లు చేస్తున్నారని మరో ఫిర్యాదు వచ్చింది. కుకట్పల్లి గ్రామం, బాలానగర్ మండల పరిధిలోని సుమారు 59 ఎకరాలు 6 గుంటల విలువైన భూమి (దాదాపు రూ.6,000 కోట్లు)పై తప్పుడు పత్రాలతో హక్కులు క్లెయిమ్చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హామీ ఇచ్చారు.
