జనగామ హోటల్స్లో ఎముకల నూనె!.. ఎనిమిది హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి

జనగామ హోటల్స్లో ఎముకల నూనె!.. ఎనిమిది హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి

జనగామ, వెలుగు: జనగామలోని ఎనిమిది హోటల్స్​పై సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ హోటల్​లో ఎముకలు కరిగించిన నూనె వాడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ హోటల్​తో పాటు మరో హోటల్​ను సీజ్ చేశారు. జిల్లా కేంద్రమైన జనగామలోని పలు హోటల్స్ అపరిశుభ్రమైన వాతావరణంలో నడిపిస్తున్నారని, కాలం తీరిన పదార్థాలు ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. 

దీంతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వినిల్​ కుమార్, మున్సిపల్​ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో 15 మంది బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో 8 హోటల్స్​పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక హోటల్​లో ఎముకలు కరిగించిన నూనె వాడుతున్న విషయాన్ని గమనించారు. 

నూనెను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ హోటల్​ను సీజ్ చేశారు. పూర్తిగా అపరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహిస్తున్న మరో హోటల్​ను సీజ్​ చేశారు. మిగిలిన ఆరు హోటల్స్​లో క్లీనింగ్ లేకపోవడం, కాలం తీరిన ఫుడ్ ఐటమ్స్​తో పాటు కారం పొడి, పెరుగు, వాటర్​ బాటిల్స్​ను సీజ్​ చేశారు. 

మూడు హోటల్స్​కు రూ.20 వేలు చొప్పున, మరో ఐదు హోటల్స్​కు రూ.10 వేల చొప్పున ఫైన్ విధించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను ల్యాబ్​కు పంపించారు.