
- ఏర్పాట్లను పరిశీలించిన ఫారెస్ట్ డిపార్ట్ మెంట్
- ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎలుసింగ్ మేరు
హైదరాబాద్, వెలుగు: యానిమల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ లో భాగంగా జీబ్రాలు, వాలబీలు, మాండ్రిల్ కోతులు, గిబ్బన్ లు వంటి కొత్త రకం జంతువులు త్వరలోనే నెహ్రూ జూ పార్క్ కు రానున్నాయని క్యూరేటర్ జె. వసంత తెలిపారు. తొలుత వాటిని క్వారంటైన్ లో ఉంచి, ఆ తర్వాత వన్యప్రాణి వారోత్సవాలు లేదా జూ డే వేడుకల సందర్భంగా సందర్శకుల కోసం ఎన్ క్లోజర్లలోకి విడుదల చేస్తామని చెప్పారు.
ఈ కొత్త జంతువుల రాకతో జూ పార్క్కు సందర్శకుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం జూ పార్క్ను రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ (వైల్డ్ లైఫ్), చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, ఐఎఫ్ఎస్ ఎలుసింగ్ మేరు ఆకస్మికంగా సందర్శించారు. యానిమల్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా ఇతర జూల నుంచి రానున్న కొత్త జంతువుల కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా జూ పార్క్స్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఎస్. హిరేమఠ్, క్యూరేటర్ జె. వసంత జూలో జరుగుతున్న వివిధ డెవలప్ మెంట్స్ పనుల గురించి, కొత్త జంతువుల కోసం సిద్ధం చేస్తున్న ప్రత్యేక ఎన్క్లోజర్ల గురించి ఎలుసింగ్ మేరుకు వివరించారు. యానిమల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా కొత్త జంతువులను జూకు తీసుకురావడానికి క్యూరేటర్ టీమ్ చేస్తున్న కృషిని ఎలుసింగ్ మేరు ప్రశంసించారు.