కొత్త లేబర్ కోడ్లతో కార్మికులకు నష్టం : ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి

కొత్త లేబర్ కోడ్లతో కార్మికులకు నష్టం : ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి

బషీర్​బాగ్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన నూతన లేబర్‌ కోడ్‌ల వల్ల కార్మికులు, ఉద్యోగులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రెస్​ అకాడమీ చైర్మన్​ శ్రీనివాస్​రెడ్డి అన్నారు. ఈ కోడ్​లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయవద్దంటూ సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేయాలని టీయూడబ్ల్యూజే(-ఐజేయూ), కేంద్ర కార్మిక సంఘాలు తీర్మానించాయి. ఈ సందర్భంగా మంగళవారం బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో టీయూడబ్ల్యూజే ఐజేయూ అధ్యక్షుడు కె.విరాహత్‌ అలీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. 

ప్రధాని మోదీ కార్పొరేట్‌ శక్తులకు కొమ్ము కాస్తూ, కార్మిక సంఘాల నేతలతో చర్చించకుండానే కొత్త లేబర్‌ కోడ్‌లను అమలు చేయడం ఆశ్చర్యకరమన్నారు.  ఈ ఇష్యూపై మీడియా చర్చలు పెట్టకపోవడం విచారకరమన్నారు. ఆల్ ఇండియా  బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీవీ కృష్ణారావు, ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌, రాష్ట్ర అధ్యక్షులు ఎండీ.యూసుఫ్‌, ఐఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎల్‌.పద్మ, ఐజేయూ స్టీరింగ్‌ కమిటీ మెంబర్​ దేవులపల్లి అమర్‌ పాల్గొన్నారు.