నల్గొండ, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ హామీలను నెరవేరుస్తోంది. తాజాగా మునుగోడు, చండూరు మండలాలకు ఆరు కొత్త రేషన్ షాపులను శాంక్షన్ చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం 2018 ఆగస్టులో తండాలను పంచాయతీలుగా మార్చడంతో పాటు, కొన్ని కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది. దీంతో రేషన్ షాపుల సంఖ్యను కూడా పెంచాల్సి ఉండె. రూల్స్ ప్రకారం ఆవాస ప్రాంతాల నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు రేషన్షాపులు లేనట్లయితే కొత్త షాపులివ్వాలి. రూరల్లో అయితే 5 వందల కార్డులు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 6 వందల నుంచి 800 కార్డుదారులు తప్పనిసరి.
ఈ రూల్స్ప్రకారం చండూరు, మునుగోడులో ఆరు షాపులు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గత నెల18న ఉత్తర్వులిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో ఆర్డీఓ నుంచి ప్రపోజల్స్ తెప్పించారు. చండూరు మండలంలో గొల్లగూడెం, శేరిగూడెం..మునుగోడు మండలంలో రావిగూడెం, గుండలోరిగూడెం, గంగోరి గూడెం, బీరెల్లిగూడెం గ్రామాలకు షాపులు మంజూరు చేశారు. ఒక్కో గ్రామంలో 114 నుంచి 290 కార్డులున్నాయని రెవెన్యూ అధికారులు చెప్పారు. ఈ షాపులకు అవసరమయ్యే డీలర్ల నియాకమ ప్రక్రియ కూడా త్వరగా చేపట్టాలని కలెక్టర్ ఆర్డీఓను ఆదేశించారు.