
ఆన్లైన్ ట్రాన్సాక్షన్లను మరింత సురక్షితం చేసే ప్రయత్నంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలు అక్టోబర్ 1, 2020 నుండి అమలులోకి వస్తాయి. దేశంలో లావాదేవీలన్నీ డిజిటల్ విధానంలోనే చేయడమే లక్ష్యంగా ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంది. ఆర్బీఐ విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలలో తాజా మార్పులు ఇవే..
1) డెబిట్, క్రెడిట్ కార్డులు దేశంలోని అన్ని ఏటీఎంలు మరియు పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) పరికరాలలో మాత్రమే ఉపయోగించబడతాయి.
2) వినియోగదారులు తమ డెబిట్, క్రెడిట్ కార్డులను భారతదేశం వెలుపల ఉపయోగించాలనుకునే వాళ్లు తమ బ్యాంకుల నుంచి అనుమతులు తీసుకోవాలి. గతంలో చాలా బ్యాంకులు తమ కార్డులను ప్రపంచంలో ఎక్కడైనా ఉపయోగించే విధంగా జారీచేశాయి.
3) ఇప్పటికే ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించి దేశీయ లావాదేవీలు, అంతర్జాతీయ లావాదేవీలు మరియు కాంటాక్ట్లెస్ లావాదేవీలను వినియోగదారుల ఇష్టానికే వదిలేసింది.
4) ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, కాంటాక్ట్లెస్ లావాదేవీలు మరియు దేశంలోకాని, విదేశంలోకానీ ఇప్పటివరకూ ఉపయోగించని అన్ని డెబిట్, క్రెడిట్ కార్డుల ఆన్లైన్ చెల్లింపును నిలిపివేయమని బ్యాంకులను ఆర్బిఐ కోరింది.
5) కొత్త నిబంధనల ప్రకారం ఖాతాదారులు ఆప్ట్-ఇన్ లేదా ఆప్ట్-అవుట్ సేవలు, ఆన్లైన్ లావాదేవీలు, అంతర్జాతీయ లావాదేవీలు, కాంటాక్ట్లెస్ లావాదేవీలు మరియు ట్రాన్సాక్షన్ పరిమితులకు సంబంధించి రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
6) మొబైల్ అప్లికేషన్ / ఇంటర్నెట్ బ్యాంకింగ్ / ఏటీఎంలు/ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) లతో పాటూ అందుబాటులో ఉన్న అన్ని ఛానెళ్ల ద్వారా కార్డులు ఆన్ / ఆఫ్ లేదా అన్ని లావాదేవీల పరిమితులను మార్చుకోవడానికి వినియోగదారులకు 24×7 యాక్సెస్ ఉంటుంది.
7) సమీప బ్యాంకు కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సి) టెక్నాలజీ ఆధారంగా చాలా బ్యాంకులు కార్డులు కూడా ఇస్తున్నాయి. అటువంటి కార్డులను స్వైప్ చేయవలసిన అవసరం లేదు. వాటిని కూడా పీఓఎస్ ద్వారా వాడుకోవచ్చు. వీటినే కాంటాక్ట్లెస్ కార్డులు అని కూడా అంటారు. కార్డ్ హోల్డర్లకు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలా వద్దా అనే ఆప్షనల్ సదుపాయం ఉంటుంది.
8) డెబిట్ మరియు క్రెడిట్ కార్డులలో లావాదేవీల పరిమితిని మార్చుకునే సదుపాయం ఖాతాదారుల కోసం ఏర్పాటు చేయబడింది.
9) కొత్త నిబంధనలు డెబిట్ మరియు క్రెడిట్ కార్డులకు మాత్రమే వర్తిస్తాయి. ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డులు లేదా మాస్ ట్రాన్సిట్ సిస్టమ్స్ (మెట్రో) కార్డులకు వర్తించవు.
10) ఈ ఆదేశాలు పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లోని సెక్షన్ 10(2) ప్రకారం జారీ చేయబడ్డాయి.
సైబర్ మోసాలు పెరుగుతున్న క్రమంలో ఈ చర్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ కొత్త మార్గదర్శకాల ద్వారా డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు మరింత సురక్షితం చేయబడి దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు.
For More News..