
- అటవీశాఖ అనుమతులు వచ్చినా స్పీడ్ అయితలే
- మూడు రాష్ట్రాల ప్రజల కష్టాలు
- నిమ్మకు నీరెత్తినట్లుగా కాంట్రాక్ట్ సంస్థ
- ఆఫీసర్ల తీరుపై వాహనదారుల ఫైర్
కోల్బెల్ట్/ జైపూర్, వెలుగు: తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గఢ్రాష్ట్రాలను కలిపే నిజామాబాద్–-జగ్దల్పూర్ నేషనల్హైవే 63 విస్తరణ పనులు మూడు రాష్ట్రాల ప్రయాణికులకు చుక్కలు చూపుతున్నాయి. మొదలై ఆరేండ్లు గడుస్తున్నా పనులు పూర్తికాక గుంతలు, కంకర, దుమ్ము, ధూళితో వాహనదారులకు నరకం కనిపిస్తోంది. కావాల్సినన్ని ఫండ్స్, అటవీశాఖ సహా అన్ని అనుమతులు ఉన్నప్పటికీ పనులు పూర్తిచేయడంలో కాంట్రాక్ట్ సంస్థ వెనుకబడింది. పనులను స్పీడ్ చేయాల్సిన ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై పబ్లిక్ మండిపడ్తున్నారు.
ఆరేళ్లుగా సాగుతున్న విస్తరణ పనులు
నేషనల్హైవే63 రాష్ట్రంలో నిజామాబాద్జిల్లా పెర్కిట్లో ప్రారంభమై మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం రాపన్పల్లి మీదుగా మహారాష్ట్రలోని సిరోంచా వెళ్తుంది. తెలంగాణలో 268 కి.మీ. మేర ఈ రోడ్డు ఉంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రసూల్పల్లి వాగు నుంచి చెన్నూరు బైపాస్ మీదుగా కోటపల్లి మండల బబ్బెరచెలుక వరకు(నేషనల్ హైవేలోని 180.60 కి.మీ. నుంచి 223 కి.మీటర్లు) 42.4 కి.మీ. పొడవునా రూ.163.8 కోట్లతో 2017 జనవరిలో రహదారి విస్తరణ పనులను చేపట్టారు. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్రావుకు చెందిన మధుకాన్ ప్రాజెక్ట్ లిమిటెడ్ టెండర్ దక్కించుకొని పనులు ప్రారంభించింది. 2019 మార్చిలోపు విస్తరణ పనులు చేయాల్సి ఉండగా మరో రెండేండ్లు గడువు పొడిగించారు. ఏడు మీటర్ల జాతీయ రహదారిని పది మీటర్లుగా విస్తరించడంతో పాటు జైపూర్, భీమారం మండల కేంద్రాల్లో మూడు కి.మీ. చొప్పున ఫోర్లేన్, ఇరువైపులా కాలువల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉన్నా ఇప్పటివరకు పూర్తికాలేదు. భీమారం,-చెన్నూరు మండలాల సరిహద్దున ఉన్న జోడువాగుల ప్రాంతంలో రిజర్వు ఫారెస్ట్ఉంది. ఇక్కడ రోడ్డుతో పాటు వంతెన నిర్మాణానికి గత ఏడాది ఆగస్టులో అటవీ, పర్యావరణ శాఖ పర్మిషన్లు వచ్చాయి. కేవలం బ్రిడ్జి వద్ద చెట్లను తొలగించి ఊరుకున్నారు. భీమారం సమీపంలోని మాంతమ్మ ఆలయం నుంచి జైపూర్లోని గురుకులం వరకు సుమారు 8.5 కి.మీ. రహదారిని 10 మీటర్ల వరకు విస్తరించేందుకు అటవీశాఖ పర్మిషన్లు రావాల్సి ఉంది.
ఇరుకు వంతెన.. కొనసాగుతున్న పనులు
భీమారం-, చెన్నూరు మండలాల సరిహద్దున ఉన్న జోడువాగుల బ్రిడ్జి వర్క్స్ఇంకా స్టార్ట్ కాలేదు. దశాబ్దాల కింద కట్టిన పాతబ్రిడ్జి ఇరుకుగా ఉంది. దీనికి రెండు వైపులా సింగిల్ రోడ్డుపై రెండు కి.మీ. వరకు గుంతలు పడ్డాయి. బ్రిడ్జికి ఇరువైపులా మూలమలుపులు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జైపూర్ మండలం రసూల్పల్లి వాగుపై ప్రారంభించిన బ్రిడ్జి నిర్మాణ పనులు ఐదేండ్లవుతున్నా పూర్తికాలేదు. వానాకాలంలో వాగు ఉప్పొంగి ప్రవహించినప్పుడు మూడు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భీమారం, -పోలంపల్లి మధ్యలో ఏడాదిగా కల్వర్టు పనులు కొనసాగుతున్నాయి. జోడువాగుల బ్రిడ్జి సమీపంలో భారీ గుంతలు, దుమ్ము, ధూళి కారణంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సింగిల్ రోడ్డు కావడంతో నైట్టైమ్లో బైక్లు గుంతల్లో పడుతున్నాయని, ఇసుకలారీలు, భారీ వెహికల్స్తో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే జాప్యం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.
ఆఫీసర్లు పట్టించుకుంటలేరు
ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతోనే రోడ్డు విస్తరణ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. పెరిగిన ట్రాఫిక్తో నిత్యం ఇబ్బందులు పడుతున్నాం. ఇరుకైన రోడ్డు కావడంతో బ్రిడ్జి వద్ద యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. జోడువాగులపై కొత్త బ్రిడ్జి వర్క్స్ స్టార్ట్ చేయలేదు. ఫారెస్ట్లో రోడ్డు వెడల్పుకు పర్మిషన్ వచ్చినా పనులు చేయడం లేదు.
- వెల్పుల శ్రీనివాస్, బీజేపీ లీడర్
ఏప్రిల్ లోపు పూర్తి చేస్తాం
నేషనల్ హైవే 63 విస్తరణ పనులు ఏప్రిల్ 2023లోపు పూర్తి చేయాల్సి ఉంది. ఫారెస్ట్లో సంబంధిత శాఖ పూర్తిస్థాయిలో చెట్లను తొలగించిన తర్వాత రోడ్డు విస్తరణ పనులు చేపడతాం.
- అన్నయ్య, నేషనల్ హైవే డీఈ