
- 12 ప్రజాసంఘాల నాయకుల ఇండ్లలో సెర్చింగ్
- ఫోన్లు, హార్డ్ డిస్క్లు, పుస్తకాలు స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: ఏపీ, తెలంగాణలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) ఆకస్మిక దాడులు చేసింది. సోమవారం తెల్లవారుజాము నుంచి రెండు రాష్ట్రాల్లోని 62 ప్రాంతాల్లో సోదాలు చేసింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో రెండు రాష్ట్రాల్లోని పౌరహక్కుల సంఘల నేతలు, అమరుల బంధు మిత్రుల సంఘం నాయకుల ఇండ్లలో తనిఖీలు నిర్వహించింది.
సత్యసాయి జిల్లాలోని ప్రగతిశీల కార్మిక సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ చండ్ర నర్సింహులును అరెస్ట్ చేసింది. ఆయన ఇంట్లో పిస్టల్,14 లైవ్ రౌండ్స్ స్వాధీనం చేసుకుంది. కడప జిల్లాలో రూ.13 లక్షలు, మావోయిస్టు సాహిత్యం సీజ్ చేసింది. ఈ సోదాల వివరాలను ఎన్ఐఏ అధికారులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
మావోలకు సహకరిస్తున్నారని కేసు
ఏపీ అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగ్పుటు పీఎస్లో 2020 నవంబర్23న మావోయిస్టుల కదలికలు, విప్లవ సాహిత్యం చేరవేస్తున్నారనే కేసు నమోదైంది. మావోయిస్టు విప్లవ సాహిత్య పుస్తకాలు, మందులు, రెడ్ కలర్ బ్యానర్ క్లాత్, ఎలక్ట్రికల్ వైర్ బండిల్స్, బ్యాటరీలు, కరపత్రాలను తరలిస్తున్న పాంగి నాగన్న అనే వ్యక్తిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ఆధారంగా ఎన్ఐఏ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఏడుగురు నిందితులపై 2021 మే 21న విజయవాడలోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది.ఈ కేసు దర్యాప్తులో సేకరించిన సమాచారంతో మావోయిస్ట్ సానుభూతిపరులు, విరసం, పౌరహక్కుల సంఘాలు, అమరుల బంధు మిత్రుల సంఘం, చైతన్యమహిళా సంఘం, కుల నిర్మూలన పోరాట సమితి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య సహా మొత్తం 12 సంఘాల వివరాలను ఎన్ఐఏ రాబట్టింది.
న్యాయవాది ఇంట్లో..
ఏపీలోని 53 ప్రాంతాలు, తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, హనుమకొండ, ఆదిలాబాద్లోని 9 ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు చేసింది.హైదరాబాద్ విద్యానగర్లో ఉంటున్న హైకోర్ట్ న్యాయవాది సురేష్ ఇంట్లో 8 గంటల పాటు సోదాలు చేసింది. బ్యాంక్ స్టేట్మెంట్స్,సెల్ఫోన్ సహా పలు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నది. కోర్టు కేసుల్లో సురేష్ వాదిస్తున్న మావోయిస్ట్, పౌరహక్కుల సంఘాల కేసుల వివరాలను సేకరించారు. సోదాలు ముగిసిన అనంతరం సురేష్కు నోటీసులు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కొందుర్గ్ మండలం పాత ఆగిరాలలోని గుమ్మడి రామచంద్రయ్య ఇంట్లో తనిఖీలు చేశారు. ఆయన ఇంటి నుంచి రెండు డైరీలను స్వాధీనం చేసుకున్నారు.
అల్వాల్, హనుమకొండలో..
మేడ్చల్ జిల్లా అల్వాల్ సుభాష్నగర్లోని అమరుల బంధు మిత్రుల సంఘం నాయకురాలు భవానీ ఇంట్లో తనిఖీలు చేశారు. గతంలో జరిగిన ఎన్కౌంటర్స్లో భవానీ ఆమె భర్త కృష్ణల బంధువులు మృతి చెందారు. దీంతో అమరుల బంధు మిత్రుల సంఘంలో వీరిద్దరు కీలకపాత్ర పోషిస్తున్నారు. భవానీ భర్త కృష్ణ ఒక్కడే ఇంట్లో ఉండగా.. సోమవారం ఉదయం 5.30 గంటలకు ఎన్ఐఏ అధికారులు ఇంటికి వచ్చి సెర్చ్ వారెంట్ చూపించి ఇంట్లో సోదాలు చేశారు. విప్లవ సాహిత్యంతో పాటు అనుమానాస్పద డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణ స్టేట్మెంట్ రికార్డ్ చేసి, నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. హబ్సిగూడలోని సుధ అపార్ట్మెంట్స్లో ఉంటున్న వరవరరావు స్నేహితుడు రాజు ఇంట్లో సోదాలు జరిపారు. హనుమకొండ హంటర్ రోడ్డు ప్రకాశ్ రెడ్డిపేటలోని చైతన్య మహిళా మండలి సభ్యురాలు అనిత, పైడిపల్లికి చెందిన మావోయిస్టు నేత సృజన తల్లి, అమరుల బంధు మిత్రుల కమిటీ సభ్యురాలు శాంతమ్మ ఇండ్లలో సోదాలు చేశారు.
సోదాలను ఖండించిన సంఘాలు
గాంధీ జయంతి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రజాసంఘాల నాయకుల ఇండ్లపై ఎన్ఐఏ చేసిన సోదాలను మానవ హక్కుల వేదిక, చైతన్య మహిళా సంఘం ఖండించాయి. అందరి ఇళ్లలో సోదాలు జరిపిన ఎన్ఐఏ అధికారులు పుస్తకాలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, వారి సంస్థలకు సంబంధించిన లెటర్ హెడ్ ప్యాడ్స్ తీసుకెళ్లారని, ప్రజా సంఘాలపై సాగుతున్న నిర్బంధాలను అందరూ ఖండించాలని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్బి. జ్యోతి, మానవ హక్కుల వేదిక బాధ్యురాలు వి.వసంత లక్ష్మి తదితరులు కోరారు.