
విడాకుల విషయం తరువాత సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika konidela). ఆమె గురించి ఏ చిన్న వార్త వినిపించినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇక విడాకుల విషయంలో కూడా ఆమె చాల ట్రోల్స్ ను ఎదుర్కొంది. కానీ అవేవి పట్టించుకోకుండా చైతన్య జొన్నల గడ్డతో ధాంపత్య జీవితానికి స్వస్తి పలికి తనపనేదో తాను చేసుకుంటూ వెళ్తున్నారు.
వాస్తవానికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో పెళ్లైన రెండేళ్లకే వీరు దూరమయ్యారు. అయితే విడాకులకు గల కారణాలపై చైతన్య గానీ...నిహారిక గానీ ఇంతవరకూ ఎక్కడా స్పందించలేదు. లేటెస్ట్ గా నిహారిక ఒక పాడ్ కాస్ట్ లో భర్తతో విడాకులపై మొదటిసారి నోరు విప్పింది.
'పెళ్లి తరువాత నటనను వదిలేస్తారా..? అని అందరూ అడుగుతారు. ఈ మధ్య మా వదిన లావణ్యను కూడా అదే అడిగారు. పెళ్లి తరువాత నటనను మేం ఎందుకు వదిలేస్తాం. అదే మా వృత్తి కదా. ఖచ్చితంగా ఊపిరి ఉన్నంత వరకు నటిస్తాం. మధ్యలో నిర్మాతగా మారడం వలన నటనకు కొద్దిగా గ్యాప్ ఇచ్చాను. అయితే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకునేముందు ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోవాలి. అది జరుగకపోతే మనకు సెట్ అవని వ్యక్తిపై ఈ మాత్రం ఆధారపడకూడదు. ఎందుకంటే వాళ్లు మన ఇంట్లో అమ్మానాన్నలా ఉండరు కదా..ముఖ్యంగా అంత ప్రేమగా అస్సలు మనల్ని చూసుకోలేరు. అందుకే ఎవరి మీదా ఆధారపడకుండా ఒంటరిగా ఉండడం..చాలా విభిన్నంగా ఆలోచించడం నేర్చుకున్నాను. నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. విడాకులు తీసుకున్న సమయంలో నన్ను చాలా మంది చాలా మాటలు అన్నారు.ఆ బాధ తట్టుకోలేక ఎన్నోసార్లు ఏడ్చాను. అలాంటి వాటిని భరించడం అంత ఈజీ కాదు. ఎవరైనా జీవితంలో కలిసి ఉండాలనే పెళ్లి చేసుకుంటారు.
ఒక ఏడాదిలో విడిపోతామని తెలిసి అంత డబ్బు ఖర్చుపెట్టి ఎవరు మ్యారేజ్ చేసుకోరు కదా. నేను కూడా అలాగే పెళ్లి చేసుకున్నాను.. కానీ, మా ఇద్దరికి సెట్ అవ్వలేదు. కలిసి ఉండాలనే నేను కోరుకున్నాను..మనం అనుకున్నవే జరగాలని లేదు కదా..విడాకుల తరువాత నా గురించి చాలా విధాలుగా రాసుకొచ్చారు. నేను వాటిని అస్సలు పట్టించుకోలేదు. కానీ, నా క్యారెక్టర్ ని తప్పుబట్టారు..నా కుటుంబాన్ని దూషించారు..అప్పుడు నేను అస్సలు తట్టుకోలేకపోయాను. కానీ, నా కుటుంబం నన్ను ఎప్పుడు బరువనుకోలేదు.
ఈ రెండేళ్లలో కుటుంబం విలువ ఏంటో తెలిసింది. పెళ్లి-విడాకుల తర్వాత ఎవర్నీ నమ్మకూడదని అర్దమైంది. ఇదొక గుణపాఠం. నేను ఎప్పటికీ సింగిల్ గా ఉండాలనుకోవడం లేదు.. నా వయస్సు 30 మాత్రమే..మంచి వ్యక్తి ఎదురుపడితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నీహారిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నిహారికకు, అప్పటి గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు కొడుకు చైతన్యకు 2020 డిసెంబర్ లో రాజస్థాన్ జైపూర్ లో పెళ్లి జరిగింది. నిహారిక ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లతో పాటు మంచు మనోజ్ 'వాట్ ది ఫిష్' మూవీలో నటిస్తుంది. అలాగే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై ఒక సినిమా నిర్మిస్తుంది.