- పాకిస్తాన్లో దారుణం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో బుధవారం దారుణం జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది హత్యకు గురయ్యారు. మలాకాండ్ జిల్లాలోని బత్ఖేలా తహసీల్లో ఉన్న వారి ఇంటిపై బంధువులే దాడి చేశారు. నిద్రలో ఉన్న తొమ్మిది మందిపై కాల్పులు జరిపారు. దాంతో వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారని వివరించారు. 9 మంది కుటుంబ సభ్యులు పడుకుని ఉండగా కొంతమంది బంధువులు ఇంట్లోకి చొరబడి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని తెలిపారు. పెండ్లికి సంబంధించిన వివాదమే హత్యలకు కారణమని అనుమానిస్తున్నట్లు చెప్పారు.