
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు రూ.130 కోట్ల విలువైన ఈ–రూపాయలు/డిజిటల్ రూపాయలు వాడకంలో ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. హోల్సేల్ సెగ్మెంట్ డిజిటల్ రూపాయిని 2022 నవంబరులో, రిటైల్ సెగ్మెంట్లో డిజిటల్ రూపాయిని 2022 డిసెంబరులో పైలట్ పద్ధతిన ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ , హెచ్ఎస్బీసీ వంటి తొమ్మిది బ్యాంకులు డిజిటల్ రూపాయి హోల్సేల్ పైలట్లో పాల్గొంటున్నాయి.
డిజిటల్ రూపాయి డిజిటల్ టోకెన్ రూపంలో ఉంటుంది. ఫిజికల్ కరెన్సీకి సమానంగా దీనికీ విలువ ఉంటుంది. పేపర్ కరెన్సీ డినామినేషన్ల మాదిరే దీనినీ విడుదల చేస్తారు. బ్యాంకులో అందించే డిజిటల్ వ్యాలెట్ల ద్వారా డిజిటల్ రూపాయిని ఉపయోగించుకోవచ్చు. టీ సెల్లర్లు, పండ్ల అమ్మకందారులు, చిన్న దుకాణదారులు వంటి వాళ్లు కూడా డిజిటల్ రూపాయిని వాడుతున్నారని సీతారామన్ చెప్పారు. రిటైల్ చైన్లు, పెట్రోల్ పంపులు మొదలైనవి కూడా డిజిటల్ రూపాయిని తీసుకుంటున్నాయని, కొంతమంది ఆన్లైన్ షాపింగ్ కంపెనీలు కూడా డిజిటల్ రూపాయిని అంగీకరిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.