వాషింగ్టన్: అదానీ గ్రూప్ పరిణామాలపై ఇప్పుడు మాట్లాడలేనని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చెప్పారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ సమావేశాల కోసం అమెరికా వచ్చిన మినిస్టర్తో బ్లూమ్బర్గ్ మాట్లాడారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్టు, ఆ తర్వాత అదానీ గ్రూప్ షేర్లకు వచ్చిన భారీ నష్టం, సంబంధిత అంశాలపై ఏమీ చెప్పలేనని, ఎందుకంటే అది కోర్టులో ఉందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై సుప్రీం కోర్టు నియమించిన పానెల్ దర్యాప్తు జరుపుతోందని ఆమె వివరించారు. ఇండియాలోని రెగ్యులేటరీ సిస్టమ్స్ పటిష్టంగా ఉన్నాయని, ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే సామర్ధ్యం వాటికి ఉందని ఫైనాన్స్ మినిస్టర్ ఈ సందర్భంగా చెప్పారు. కొత్త ఉద్యోగాల కల్పన, ప్రైవేటీకరణలో జోరు తగ్గడం, దేశం ఎదుర్కొంటున్న ఎకనమిక్ ఛాలెంజెస్ వంటి అంశాలపై నిర్మలా మాట్లాడారు. ఉక్రెయిన్ వార్, ఒపెక్ ప్లస్ దేశాల ప్రొడక్షన్ కోత వంటివి తమకు ఎక్కువ ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.