
బ్యాంకాక్: అండర్–19 ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో ఇండియన్ యంగ్ బాక్సర్లు పతకాల మోత మోగించారు. అండర్–19 కేటగిరీలో ఆదివారం బరిలోకి దిగిన 10 మంది విమెన్ బాక్సర్లలో తొమ్మిది మంది పతకాలు సాధించారు. ఇందులో రెండు గోల్డ్, ఐదు సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. మెన్స్లో ఐదుగురు పోటీపడితే ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు లభించాయి. ఓవరాల్గా ఈ కేటగిరీలో ఇండియన్ బాక్సర్లు 3 గోల్డ్ సహా 14 మెడల్స్ సాధించారు. విమెన్స్ 54 కేజీల ఫైనల్ బౌట్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన నిషా స్వర్ణంతో మెరిసింది.
4–1తో సిరుయి యాంగ్ (చైనా)పై గెలిచింది. తొలి రెండు రౌండ్స్లో డిఫెన్స్కు పరిమితమైన నిషా.. మూడో రౌండ్లో పంచ్ల వర్షం కురిపించింది. హోరాహోరీగా సాగిన ఈ రౌండ్లో అప్పర్ కట్స్, హుక్స్తో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. బలమైన పంచ్లను అడ్డుకోలేకపోయిన యాంగ్ ముఖాన్ని చేతుల్లో పెట్టుకుని డిఫెన్స్తోనే సరిపెట్టుకుంది. ఇక 57 కేజీ టైటిల్ బౌట్లో ముస్కాన్ 3–2తో అయేజాన్ ఎర్మెక్ (కజకిస్తాన్)ను చిత్తు చేసి స్వర్ణం సాధించింది. స్టార్టింగ్లో దూకుడుగా పంచ్లు విసిరిన ఇండియన్ బాక్సర్కు రెండో రౌండ్లో ఎర్మెక్ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది.
అయితే కీలక టైమ్లో ముస్కాన్ వరుసగా పాయింట్లు నెగ్గి ప్రత్యర్థిని డిఫెన్స్లో పడేసింది. 75 కేజీల ఫైనల్లో ఆరతి కుమారి.. టోంగోటొంగ్ గు (చైనా) చేతిలో, 80 కేజీల్లో కృతిక వాసన్ 2–3తో కురలే యెగిన్బైకిజీ (కజకిస్తాన్) చేతిలో, 80+ కేజీల్లో ప్రాచీ టొకాస్ 2–3తో సోబిరాఖోన్ షాఖోబిడినోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో, 60 కేజీల్లో వినీ.. సెవారా మమటోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో, 65 కేజీల్లో నిషా 1–4తో అరింద అకిమోటో (జపాన్) చేతిలో ఓడి రెండో ప్లేస్లో నిలిచి సిల్వర్ మెడల్స్తో సరిపెట్టుకున్నారు. ప్రతి బౌట్లోనూ అంచనాలను అందుకున్న ఇండియన్ బాక్సర్లు స్వల్ప తేడాతో పాయింట్లు కోల్పోయారు. యాషిక (51 కేజీ), ఆకాంక్ష పలస్వాల్ (70 కేజీ) తమ ప్రత్యర్థులపై నెగ్గి బ్రాంజ్ మెడల్స్ను కైవసం చేసుకున్నారు.
రాహుల్ సూపర్..
మెన్స్ 75 కేజీల్లో కచ్చితంగా పతకం వస్తుందని ఆశించిన రాహుల్ కుండు దాన్ని నెరవేర్చాడు. ఫైనల్లో రాహుల్ 4–1తో ముహమ్మద్జోన్ యాకుప్బోవెక్ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచాడు. ఏకపక్షంగా సాగిన ఈ బౌట్లో ఇండియన్ బాక్సర్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. స్టార్టింగ్లోనే అప్పర్ కట్స్తో చెలరేగిన రాహుల్ జడ్జిలను ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి విసిరిన పంచ్లను తప్పించుకుంటూనే కీలక టైమ్లో పిడి గుద్దులు కురిపించాడు. దీంతో వరుసగా పాయింట్లు వచ్చాయి.
మూడో రౌండ్లో కొట్టిన హుక్స్, రిబ్ షాట్స్కు యాకుప్బోవెక్ వద్ద సమాధానం లేకపోయింది. ఇక 65 కేజీ ఫైనల్లో మౌసమ్ సుహాగ్.. జఖోంగిర్ జైనిడినోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో, హేమంత్ సాంగ్వాన్.. రసూల్ అస్సాంఖానోవ్ (కజకిస్తాన్) చేతిలో ఓడి రజతాలతో సంతృప్తి పడ్డారు. మెన్స్ 55 కేజీల్లో శివమ్, 85 కేజీల్లో గౌరవ్ కాంస్య పతకాలు సాధించారు. అండర్–22 కేటగిరీలో ఇప్పటికే ఇండియాకు 13 పతకాలు ఖాయం కాగా, ఇందులో ఐదుగురు బాక్సర్లు సోమవారం గోల్డ్ మెడల్ కోసం బరిలోకి దిగుతారు. అండర్–19, 22 కేటగిరీలో ఇండియా తరఫున మొత్తం 40 మంది బాక్సర్లు బరిలో ఉన్నారు.