
హైదరాబాద్: హాస్టల్ సమస్య పరిష్కారం టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తో నిజాం కాలేజీ విద్యార్థినుల చర్చలు ముగిశాయి. కొత్తగా నిర్మించిన హాస్టల్ లో 50శాతం పీజీ విద్యార్థినులకు, మరో 50శాతం యూజీ విద్యార్థినులకు కేటాయిస్తామని నవీన్ మిట్టల్ ప్రతిపాదించారు. దీంతో విద్యార్థినులు కాలేజీకి వెళ్లి మిగిలిన వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తోటి విద్యార్థినులతో మాట్లాడిన అనంతరం మధ్యాహ్నం 3.30గంటలకు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
నిజాం కాలేజీలో కొత్తగా నిర్మించిన గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ ను యూజీ విద్యార్థినులకు కేటాయించాలంటూ గత కొన్ని రోజులు ఆందోళన చేస్తున్నారు. కేటీఆర్ జోక్యంతో రంగంలోకి దిగిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిజాంకాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ అభ్యర్థన మేరకు 10 మంది విద్యార్థినులు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తో సమావేశమై సమస్యపై చర్చించారు.