- 68 కిలోల రైస్ ఇవ్వలేమని వాదన
- క్వింటాల్కు 10 కిలోల తరుగు ఇస్తేనే గోదాముల్లోకి బస్తాల షిఫ్టింగ్
- అతికష్టం మీద 45 వేల టన్నుల సేకరించిన యంత్రాంగం
నిజామాబాద్, వెలుగు: దిగుబడి బాగుంటుంద్న ఆశతో నిజామాబాద్ జిల్లాలో యాసంగిలో వేసిన దొడ్డు రకం వరి రైతులను తిప్పలు పెడుతోంది. కోతలు పూర్తయి వడ్లు అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నారు. సర్కార్ కొనుగోలు సెంటర్లలో కాంటాలు జరిగాక 68 కిలోల బియ్యం ఎఫ్సీఐకి ఇవ్వలేమని బాయిల్డ్ మిల్లర్లు బస్తాలను దింపుకోవడంలేదు. అంతేకాకుండా క్వింటాల్కు 10 కిలోల తరుగు తీస్తుండడంతో రైతులు ఆందోళనలు చేస్తున్నారు.
వన్ టు కా ఫోర్ మాయలో పడి..
జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 5.22 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 4.31 లక్షల ఎకరాల్లో సాగు చేయగా 60,793 ఎకరాల్లో దొడ్డు రకం వరి వేశారు. దొడ్డు రకం సాగుకు రైతులు సాధారణంగా 1010 సీడ్ను ఎంచుకుంటారు. అయితే దిగుబడి వస్తుందని జరిగిన ప్రచారాన్ని నమ్మి డీజే టిల్లు, బతుకమ్మ, రష్మి, వన్ టూకా ఫోర్ తదితర కొత్త రకాల సీడ్ను వేశారు. ఇవి బస్తాల్లో నిండుగా కనిపిస్తున్నప్పటికీ బరువు రావట్లేదు. కొనుగోలు సెంటర్లలో 17 శాతం వరకు తేమ ఉన్న వడ్లను కొంటున్నారు.
అయితే జిల్లాలో ఎండలు దంచికొడుతుండడంతో వడ్ల తేమ 11 శాతానికి తగ్గిపోయింది. కావాల్సిన దానికంటే ఎక్కువగా ఎండడంతో వడ్ల బరువు, మిల్లర్ అవుట్ టర్న్ రేషియో(ఓటీఆర్)పై ప్రభావం పడుతోంది. సీఎంఆర్ అలాట్మెంట్ పొందిన రారైస్ మిల్లర్ ప్రతి క్వింటాల్ వడ్లకు పది కిలోల నూకలు కలిపి 67 కిలోల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలి. బాయిల్డ్ మిల్స్ అయితే ఐదు కిలోల నూకలు కలిపి 68 కిలోల రైస్ అందించాలి.
రైతుల పోరుబాట
యాసంగిలో 11 లక్షల మెట్రిక్టన్నుల వడ్ల దిగుబడి అంచనాతో సివిల్ సప్లయ్ ఆఫీసర్లు 6.80 లక్షల టన్నుల సన్నాలు, 1.20 లక్షల టన్నుల దొడ్డురకం కలిపి మొత్తం 8 లక్షల టన్నుల కొనుగోలు టార్గెట్ పెట్టుకున్నారు. 739 సెంటర్లు ఓపెన్ చేసి ఇప్పటిదాకా 4.65 లక్షల టన్నుల సన్నాలు కొన్నారు. దొడ్డు రకం 45 వేల టన్నుల మాత్రమే కొన్నారు. కొనుగోళ్లలోనూ భారీగా తరుగు పెడుతున్నారని ఆరోపణలున్నాయి. క్వింటాల్ దొడ్డు వడ్లకు 12 కిలోల తరుగు పెడుతున్నారని మండిపడ్డ రైతులు మోర్తాడ్లో 11న మహాధర్నా చేశారు.
అంతకు ముందు కొనుగోలు సెంటర్ లో కంటాలు పెట్టట్లేదని బాల్కొండ రైతులు రాస్తారోకోకు దిగారు. క్వింటాల్కు 10 కిలోల తరుగు అడుగుతున్నరని భీంగల్ మండల కేంద్రంలోని కొనుగోలు సెంటర్ వద్ద రాస్తారోకో చేశారు. ఈ నెల 1న ఇందల్వాయి మండలంలో, అదే రోజు సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేశారు.
