
నిజామాబాద్, వెలుగు: జిల్లా రాజకీయాల్లోకి వలస రాలేదని, తాను పక్కా లోకల్ లీడర్ నని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నానని, నిధుల మంజూరుపై అవగాహన లేకుండా ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం ఆమె అవివేకమని అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన స్పైసెస్బోర్డుకు రూ. 2.73 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై బుధవారం సాయంత్రం అర్వింద్ఓ ప్రకటన విడుదల చేశారు. పసుపు రైతుల కోసం 2021లో రూ. 74.81 లక్షలు మాత్రమే విడుదల అయ్యాయని కవిత పేర్కొనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఆర్టీఐ కింద 2021 మే 9 న దరఖాస్తు చేస్తే అక్టోబర్ 5న స్పైసెస్ బోర్డ్నిధుల వివరాలను తెలిపిందన్నారు. అక్టోబర్అనంతరం రెండుసార్లు నిధులు విడుదల అయ్యాయని చెప్పారు. పసుపు రైతుల సంక్షేమానికి దేశంలోని 10 రీజినల్ సెంటర్లకు రూ. 6.75 కోట్లు విడుదలయ్యాయన్నారు. కవిత ఎంపీగా పనిచేసిన అయిదేండ్లలో 13 బాయిలర్లు, 3 పాలిషర్లు మంజూరయ్యాయని, తాను ఎన్నికైన మూడేండ్లలో 108 బాయిలర్లు, 209 పాలిషర్లు, 7,240 టార్పాలిన్ షీట్లను పసుపు రైతులకు అందించినట్లు తెలిపారు.