
- నిజామాబాద్ జిల్లాలో పోలీసుల అవగాహన సదస్సులు, ర్యాలీలు
బోధన్/కోటగిరి/వర్ని, వెలుగు:మత్తు పదార్థాలను నిర్మూలించాలని నిజామాబాద్ జిల్లాలోని బోధన్, కోటగిరి, రుద్రూర్ మండల కేంద్రాల్లో పోలీసులు సోమవారం ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. బోధన్ పట్టణంలోని బస్టాండ్లో ఆర్టీసీ అధికారులతో కలిసి సీఐ వెంకటనారాయణ, సిబ్బంది ప్రయాణికులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, బస్సుల్లో తరలించినా సమాచారం ఇవ్వాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. అనంతరం మత్తు పదార్థాల నిర్మూలన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పట్టణ ఎస్సై మనోజ్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
కోటగిరి మండల కేంద్రంలో..
కోటగిరి ఎస్సై సునిల్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వాడితే కలిగే అనర్థాలను వివరించారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలు సహకరించాలని సూచించారు.
రుద్రూర్ మండల కేంద్రంలో..
డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలని, జీవితాలు నాశనం చేసుకోవద్దని రుద్రూర్ ఎస్సై సాయన్న సూచించారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలోని అవగాహన సదస్సులో ఎస్సై మాట్లాడారు. డ్రగ్స్ రవాణాపై నిఘా పెట్టామని, ఎవరైనా వాడినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏఎస్సై రాజు, సురేశ్, ఏఎన్ ఎం గౌరీ, ఆశవర్కర్లు లత, ప్రేమలత, నిర్మల పాల్గొన్నారు.