
- త్వరలో పాఠశాలలు ప్రారంభం
- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు
- అధికారులు సమావేశాలు నిర్వహించినా పట్టించుకోని వైనం
నిజామాబాద్, వెలుగు : మరో పది రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు తమ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. విద్యార్థులను క్షేమంగా తీసుకొచ్చి మళ్లీ ఇంటికి చేర్చే స్కూల్ బస్సు ఫిట్నెస్ విషయాన్ని విస్మరిస్తున్నాయి. 15 ఏండ్లు దాటిన బస్సులను నడుపుతూ పిల్లలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ట్రాన్స్పోర్ట్ అధికారులు చెకింగ్ చేస్తే మేనేజ్ చేయొచ్చన్న భరోసాలో ఉన్నారు.
జిల్లాలో 776 స్కూల్ బస్సులు ఉండగా, ఇప్పటి వరకు 200 బస్సులు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాయి. మే నెల 25న డీటీసీ దుర్గాప్రమీల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి అని చెప్పాకే కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు బస్సులకు మరమ్మతులు చేయించారు.
జిల్లాలో 300 పాఠశాలలు..
పిల్లలను స్కూల్కు పంపేటప్పుడు తల్లిదండ్రులు వసతులను పరిశీలించడంతోపాటు బస్సు ఫిట్నెస్, అనుభవజ్ఞుడైన డ్రైవర్ ఉన్నాడా.. విద్యాబోధన ఎలా ఉంటుంది.. తదితర అంశాలను చూసుకోవాలి. ఫిట్నెస్ లేని బస్సుల వల్ల ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో సుమారు 300 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలలో 150కి మించి బస్సులు ఉన్నాయి. జిల్లాలో 33 మండలాలు ఉండగా, ఒక్కో మండలంలో సుమారు నాలుగు స్కూల్ బస్సులకు పైనే నడుస్తున్నాయి. విద్యార్థుల నుంచి ఏడాదికి రూ.20 వేలు చార్జీలు వసూలు చేస్తున్నారు.
ట్రాన్స్పోర్ట్ అధికారులు లంచాలు తీసుకుని ఫిట్నెస్ లేని బస్సులకు పర్మిషన్లు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం బడుల ప్రారంభానికి ముందే వాహనాలను తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందించాలి. విద్యార్థులను సురక్షితంగా చేర్చే బస్సు అస్తవ్యస్తంగా ఉంటే సీజ్ చేసే అధికారం అధికారులకు ఉంది. పెద్ద స్థాయి స్కూళ్లలో పది బస్సులు ఉంటున్నాయి. వీటిలో సగం ఫిట్నెస్ చేయించి, మిగతా వాటిని వాటి పేపర్లతో నడిపిస్తున్నారు. ఏ స్కూల్లో ఎన్ని బస్సులున్నాయన్న వివరాలను రవాణా శాఖ సేకరించాల్సి ఉన్నా సరైన పరిశీలన లేకపోవడం విశేషం. డీటీసీ దుర్గాప్రమీల ప్రైవేటు యాజమాన్యాలతో మే 25న మీటింగ్నిర్వహించారు. దీంతో 200 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు
తీసుకున్నారు.
నిబంధనలు..
- 15 ఏండ్లు దాటిన స్కూల్బస్సులను వాడొద్దు. పసుపు కలర్ బస్లను మాత్రమే నడిపించాలి.
- 60 ఏండ్లలోపు వయస్సు ఉండి, ఐదేండ్ల అనుభవం ఉన్న డ్రైవర్ను అపాయింట్చేయాలి. ప్రతి మూడు నెలలకోసారి డ్రైవర్లకు కంటి పరీక్ష, బీపీ, షుగర్ పరీక్షలు చేయించి రిపోర్టులు ఫైల్ చేసి పెట్టాలి.
- బస్లో ఫస్ట్ ఎయిడ్బాక్స్ మస్ట్గా ఉండాలి. ప్రతి బస్పై స్కూల్ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ బ్లాక్ పేయింట్తో రాయాలి. డ్రైవర్తో పాటు క్లీనర్ఉండాలి.
- బస్ లోపలి భాగం అంతా డ్రైవర్కు కనబడేలా పెద్ద సైజ్మిర్రర్స్ బిగించాలి. సైడ్ మిర్రర్లు లేకుండా బస్సును బయటకు తీయొద్దు. ఫైర్ యాక్సిడెంట్ నివారణ పరికరాలు ఉండాలి.
- బుక్స్పెట్టుకోడానికి అరలు బిగించాలి. సీట్ల పరిమితికి మించి స్టూడెంట్స్ను ఎక్కించవద్దు.
12 తరువాత డ్రైవ్ చేపడతాం
స్కూల్ బస్సుల ఫిట్నెస్కు పెద్ద బడుల యాజమాన్యాలే ముందుకొస్తున్నాయి. ఒకటి, రెండు బస్సులున్న మేనేజ్మెంట్లు అశ్రద్ధ చూపుతున్నాయి. జూన్12 తరువాత ఫిట్నెస్ చెకింగ్కు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. ఫిట్నెస్లేని బస్సులను సీజ్ చేస్తాం.
ఉమామహేశ్వర్రావు, జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్