- ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లు పెంచిన ఎన్ఎంసీ
- రాష్ట్రంలో1390కి పీజీ సీట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గుడ్ న్యూస్ చెప్పింది. 2025–-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మరో 75 పీజీ సీట్లను(బ్రాడ్ స్పెషలిస్ట్) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇదివరకే 43 సీట్లను మంజూరు చేసినట్టు ఎన్ఎంసీ స్పష్టం చేసింది. తాజాగా పీజీ సీట్ల పెంపుతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది. పెరిగిన సీట్లతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,390, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 1,789 మొత్తంగా 3,179 పీజీ మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
పెరగనున్న స్పెషలిస్ట్ డాక్టర్లు...
ఎన్ఎంసీ రాష్ట్రంలో ప్రస్తుతం 75 సీట్లను పెంచింది. ఈ సీట్ల పెంపు నిర్ణయంతో ప్రభుత్వ రంగంలో పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ మరింత బలోపేతం కానుంది. ముఖ్యంగా అనస్తీషియాలజీ, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ వంటి కీలక డిపార్ట్ మెంట్లలో సీట్లు పెరగడంతో భవిష్యత్తులో ప్రభుత్వ హాస్పిటల్స్ లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత తీరనుంది. సీట్ల పెంపుతో ఎంబీబీఎస్ పూర్తిచేసిన మరింత మంది విద్యార్థులకు తక్కువ ఖర్చుతో ప్రభుత్వ కాలేజీల్లోనే స్పెషలైజేషన్ చేసే అవకాశం లభించనుంది.
కాలేజీలకు ఎన్ఎంసీ మంజూరు చేసిన 75 సీట్లు
గవర్నమెంట్ మెడికల్ కాలేజీ,
నల్గొండ: 19 సీట్లు
గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, రామగుండం: 16 సీట్లు
గవర్నమెంట్ మెడికల్ కాలేజీ,
సూర్యాపేట: 16 సీట్లు
గవర్నమెంట్ మెడికల్ కాలేజీ,
సిద్దిపేట: 8 సీట్లు
గవర్నమెంట్ మెడికల్ కాలేజీ,
మహబూబ్ నగర్: 4 సీట్లు
నిమ్స్, హైదరాబాద్: 4 సీట్లు
ఉస్మానియా మెడికల్ కాలేజీ,
హైదరాబాద్: 4 సీట్లు
గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, నిజామాబాద్: 4 సీట్లు
